కాసిపేట, ఏప్రిల్ 10 : బెల్లంపల్లి మండలం సోమగూడెంలో నెలకొన్న భూ వివాదంలో కోర్టు తీర్పు మేరకు శుక్రవారం నిర్మాణాల కూల్చివేతలు, భూ స్వాధీన కోసం పోలీసులు, అధికారులు వచ్చినా జేసీబీలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. సర్వే నెంబర్ 3పై అక్రమ నిర్మాణాల తొలగింపు, భూమి స్వాధీనానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో రాగా.. పోలీసు, రెవెన్యూ సిబ్బందిని గృహాల యజమానులు, స్థానికులు అడ్డుకున్నారు. భూ హక్కుదారుకు రూ. కోటి పరిహారం ఇచ్చేందుకు ఇరువర్గాల నాయకుల మధ్యవర్తిత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం కోర్టు అధికారులను పిలిచి బుధవారం జరిగిన కూల్చివేతల అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
సోమగూడెంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు పోలీసు బందోబస్తుతో సిద్ధంగా ఉండాలని కోర్టు ఆదేశించగా శుక్రవారం అధికారులు పోలీసులతో కలిసి వచ్చినా జేసీబీ లేక ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. దాంతో మళ్ళీ ఇరు వర్గాల మద్య చర్చలు కొనసాగుతున్నాయి. సర్వే నంబర్ 3పైదిప్రభుత్వ లావణి పట్టా భూమి కాగా క్రయ విక్రయాలు చేసుకునేందుకు అవకాశం లేదని, ఇది ఎలా సెటిల్మెంట్ చేసుకుంటారని వాదన ఉంది. కేవలం కేసు వాపస్ తీసుకోవడం తప్ప అధికారికంగా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. కానీ తర్వాత మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రాంతం లావన్ పట్టా కాగా స్థానిక నాయకులతో పాటు పలువురు ఎటువంటి సరైన పత్రాలు లేకుండా విక్రయించారు. తక్కువ ధరకు వస్తుందని ఆశ చూపడంతో తెలియక కొనుకున్నవాళ్లు ఇల్లు కట్టుకున్నారు. ఈ భూమికి తాము హక్కుదారులమని రాం కిష్టయ్య కుటుంబం కోర్టుకు వెళ్లింది. కోర్టు కిష్టయ్య కుటుంబం భూమిగా తేల్చడంతో ఇక ఆ భూమి స్వాధీనం చేసుకొని వారికి ఇచ్చేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల స్థానికులు అడ్డుకోగా మళ్ళీ శుక్రవారం చర్యల కోసం అధికారులు రాగా జేసీబీ అందుబాటులో లేకపోవడంతో బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుంది?అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది.