తాండూర్ : అధికారులు విధుల్లో అలసత్వం వహించకుండా ప్రజాప్రతినిధులతో కలిసి చిత్తశుద్ధితో పనిచేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధికారులను ఆదేశించారు. తాండూర్ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్ అధ్యక్షతన జరిగింది . ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ..అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేస్తేనే మండలం అభివృద్ధి చెందుతుందని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
పాఠశాలల్లో అసంపూర్తిగా మిగిలిన ప్రహారి నిర్మాణాలు, వంట గదుల నిర్మాణాలు, పాఠశాలల మరమ్మతులపై ఎంఈవో ప్రభాకర్ను సభ్యులు నిలదీశారు. ఉపాధి హామీ కూలీలకు పనులు చూపించాలని, జాబ్ కార్డులు అవసరమైనన్ని అందించాలని జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీటీసీ సభ్యులు కోరారు. పీహెచ్సీలో అంబులెన్స్, మండలానికి 108, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది డిప్యూటేషన్లపై ఉన్నారని వారి డిఫ్యూటేషన్ రద్దు చేయాలని కోరారు. సభ్యులు అడిగిన పలు సమస్యలకు సంబంధించిన వివరాలు అందజేస్తే నిదులు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఉచిత విద్యుత్ సౌకర్యం నాయీ బ్రాహ్మణులు , రజకులు, నిరుపేదలకు సక్రమంగా అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శశికళ, వైస్ ఎంపీపీ దాగాం నారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.