కోటపల్లి : అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న ఆదివాసీ మన్నెవార్ల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. గురువారం శాసనమండలి సమావేశంలో గిరిజన సమస్యల పై ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలో 55 వేలకు పైగా ఉన్నా మన్నెవార్లను పీటీజీ నుంచి తొలగించడంతో వారికి రావాల్సిన ప్రయోజనాలు అందటం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగం రాసినప్పటి నుంచి 2015 వరకు మన్నెవార్లు పీటీజీ గ్రూప్లో ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను వారు పొందారని తెలిపారు.
2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక సర్యులర్ వెలువర్చి మన్నెవార్లను కోలవార్లకు మార్చిందన్నారు. అనంతరం 2015లో భారత ప్రభుత్వం మరో సర్యులర్ తీయగా ఆ సర్యులర్లో పీటీజీ గ్రూప్లో కోలావార్లను చేర్చలేదన్నారు. దీనిద్వారా మన్నెవార్ కోలావార్లు 2015 నుంచి నేటి వరకు ఐటీడీఏ నుంచి ఎలాంటి ప్రయోజనం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెంచుకొని మన్నెవార్ కోలావార్లను పీటీజీ గ్రూప్లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక సర్యులర్ పంపిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్సీ వివరించారు.