మంచిర్యాల అర్బన్, జూలై 25 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్టు లెక్చరర్ల తర్వాత ఖాళీ పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 61 లెక్చరర్ పోస్టులను గెస్ట్ లెక్చరర్లతో నింపేందుకు ఈ నెల 26వ తేదీన ఆయా కళాశాలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పీహెచ్డీ అభ్యర్థులు లేకపోతే నెట్ లేదా స్లెట్ అర్హత గల అభ్యర్థులు, వీరెవరూ లేకుంటే సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించనున్నారు. సీనియార్టీ ఉంటే సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. డెమో, ఇంటర్వ్యూ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.
61 లెక్చరర్ పోస్టులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 61 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరు, చెన్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు, లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(ఏ అండ్ సీ)లో ఐదు, ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎస్)లో ఆరు, ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎనిమిది ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరు, ఆసిఫాబాద్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. నిర్మల్ జిల్లాలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదు లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ గెస్ట్ లెక్చరర్స్తో భర్తీ చేయడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల కొరత లేకుండా అవుతుంది. దీంతో విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో మెరుగైన విద్య అందనున్నది.