మంచిర్యాల అర్బన్, జూలై 25 : ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచనలకు పదును పెట్టడమేకాకుండా సైన్స్పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటింటా ఇన్నోవేటర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం 2022 సంవత్సరానికిగాను ఆవిష్కరణలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సాధారణ జీవన విధానంలో, వృత్తి వ్యాపారంలో తలెత్తే సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థానికంగా లభించే పరికరాలతో సరికొత్త వస్తువులను రూపొందించడానికి చేసే ప్రయత్నమే ఆవిష్కరణ. ఇందులో విద్యార్థులు మొదలు.. గృహిణీలు, రైతులు, యువకులు ఇలా వివిధ రంగాల వారికి అవకాశం కల్పించారు. ఆవిష్కర్తలు చేసిన పరికరాలకు వారే పేటెంట్ పొందే అవకాశం కల్పించనున్నారు.
ఆవిష్కరణ అంటే..
ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియ, ఒక కార్యక్రమం లేక మనలో కలిగే సృజనాత్మకత ఆలోచనే ఆవిష్కరణ. ఇలా ఆవిష్కరణ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడంతో పాటు సమగ్ర అవగాహన కలిగి ఉండడం ఆవిష్కరణకు దారితీస్తుంది. మన చుట్టూ ఉండే సమస్యలకు సంబంధించి వినూత్నంగా ఆలోచించి పరిష్కారానికి అవలంబించే పద్ధతి సైతం ఆవిష్కరణ అనిపించుకుంటుంది. సమస్య పరిష్కారానికి ఏదైనా వస్తువును విభిన్నంగా తయారు చేయగలిగిన వారే ఆవిష్కర్తలుగా గుర్తించబడుతారు. వారిలోని ప్రతిభను సమాజానికి తెలియజేసేందుకు ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
వాట్సాప్ ద్వారా..
వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందించే ముందు ఇందుకు సంబంధించిన ఆరు వ్యాఖ్యాలతో కూడిన ఆవిష్కరణ వివరణ, రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియో, ఆవిష్కరణ నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, వయస్సు, మొబైల్ నంబర్, ప్రస్తుత వృత్తి, పూర్తి వివరాలు, అడ్రస్ను 91006 78543 నంబర్ వాట్సాప్కు పంపించవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన ఆవిష్కరణల అంశాల నుంచి ఉత్తమమైనవి ఎంపిక చేసి ఆగస్టు 15వ తేదీన ప్రదర్శించనున్నారు. ఇందులో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రం అందజేస్తారు. గతంలో మన జిల్లా నుంచి పలువురు వాట్సాప్ నంబర్(91006 78543)కు ఆవిష్కరణలు పంపి వారిలోని ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు.
అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణల కోసం ఇది మంచి అవకాశం. దీనిని అంద రూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఆయా పాఠ శాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ఆవిష్కరణలపై ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివరాలకు 98495 50200 నంబర్లో సంప్రదించవచ్చు.
– సాయిలు మధుబాబు, జిల్లా సైన్స్ అధికారి, మంచిర్యాల
వినూత్న ఆవిష్కరణలతో రావాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ వినూత్న ఆలోచన లు, ఆవిష్కరణలతో ముందుకు రావాలి. విద్యార్థులు, ఉపాధ్యాయు లు, ఉద్యోగులు, రైతులు, యువకు లు, ఐటీ నిపుణులు, గృహిణులు, రీసెర్చర్స్ ఇలా అన్ని రంగాల వారు పాల్గొనాలి. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), హైదరాబాద్ నుంచి ప్రశంసా పత్రం అందించడంతో పాటు ఆగస్టు 15న అభినందిస్తారు. అంతేగాకుండా టీఎస్ఐసీ ద్వారా ఉత్తమ ఆవిష్కరణలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు ఈ ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు కృషి చేయాలి. – భారతీ హోళికేరి, జిల్లా కలెక్టర్, మంచిర్యాల