మంచిర్యాల ప్రతినిధి, జనవరి 31(నమస్తే తెలంగాణ) : 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాకు అతి తక్కువగా రెండు రోడ్లు మంజూరయ్యాయి. మహాగాంలో రూ.20 లక్షలు, మార్లవాయిలో రూ.20 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని సీసీ రోడ్లు మంజూరు కావచ్చని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో 190 రోడ్లు వేయనున్నారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 530, నిర్మల్లో 190, ఆదిలాబాద్లో 179 రోడ్లు వేయనున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో కొన్ని రోడ్లు వేయడం పూర్తయ్యింది. మిగిలిన రోడ్ల పనులు ఎట్టిపరిస్థితుల్లో మార్చి 31వ తేదీలోపు ప్రారంభించి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయనున్నారు. అలా చేస్తేనే వాటికి సం బంధించిన బిల్లులు మంజూరు కానున్నాయి. దీంతో రానున్న రెండు నెలల్లో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఊపందుకోనుంది.
వర్షాకాలం సాన కట్టమవుతుండె..
నా చిన్నప్పటి నుంచి చూస్తున్న. మా వాడలో రోడ్డు లేదు, ఏమీ లేదు. వానకాలం సాన ఇబ్బందులైతుండే. నడక కూడా కష్టమైతుండే. వాన పడి రోడ్డు బురదైతే బయటకు రావడానికి కూడా భయపడెటోళ్లం. ఇప్పుడు ఎమ్మెల్యే, సర్పంచ్ కృషితో మా వాడకు రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బులతో మా వాడలో కొత్త సీసీ రోడ్డు నిర్మిస్తరట. ఇగ ఈ రోడ్డును నిర్మిస్తే మాకు ఎలాంటి కట్టాలు ఉండవు. మా ఊరి బాగు కోసం పైసలు ఇచ్చిన నాయకులకు రుణపడి ఉంటాం.
– రెవెళ్లి లక్ష్మి, షట్పల్లి, కోటపల్లి మండలం.
రోడ్డు లేక ఇబ్బంది పడ్డాం..
మావాడకు చాలా ఏండ్ల నుంచి సీసీ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడ్డాం. వర్షాకాలం అయితే నడవడమే కష్టంగా ఉండేది. మా బాధలు తీరుతాయో లేదో అనుకున్నాం. కానీ.. మేం చెప్పగానే ఎమ్మెల్యే సారు కొత్త రోడ్డు వే యించిండు. ఒక మా వాడకే కాదు మా ఊరు మొత్తం ఇప్పుడు సీసీ రోడ్లతో మెరిసి పోతుంది. ఏ రాత్రయినా ఎంత వర్షం పడ్డా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చేసుకోగలుగుతున్నాం.
– మోటపల్కుల పద్మ, కొత్తూరు, లక్షెట్టిపేట మండలం
పనులు మొదలుపెడతాం..
మా గ్రామంలో గతేడా ది చాలా వరకు సీసీ రోడ్లు వేశాం. ఈసారి ఏడు రోడ్లకు దాదాపు రూ.10 లక్షల వరకు మంజూరు వచ్చింది. ఈ పనులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేస్తాం. నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొంచెం ఆలస్యమైనా మార్చి 31 నాటికి పూర్తి చేస్తాం. పల్లెల్లో ప్రతి వాడకు రోడ్డు వేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.
– ఓలపు శారద, సర్పంచ్, వేంపల్లి.