మంచిర్యాల ఏసీసీ :ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛ-స్వాతంత్య్రం అనుభవిస్తున్నామని జిల్లా కలెక్టర్ భారతీ హోళ్ళికేరి అన్నారు. అజాది కా అమృత్ మహోత్సవ్ ఇండియా – 75 వ వేడుకలలో భాగంగా శనివారం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహం నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మైదానంలో అందరితో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రతిజ్ఞ చేయించారు.ఆమె మాట్లాడుతూ త్యాగమూర్తులను స్మరించుకోవడం అందరి కర్తవ్యమని, దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు.
కొవిడ్ – 19 విపత్కర పరిస్థితులను, సమాజంలో నెలకొన్న సమస్యలను మనమంతా సమష్టిగా ఎదుర్కోవాలని కోరారు. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 అక్టోబర్ 2, 2021 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలు తమ రోజువారీ జీవితంలో కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, పరుగు, క్రీడలు వంటి ఫిట్నెస్ కార్యక్రమాలను చేర్చుకొని ఆరోగ్యంగా ఉంటూ అనేక వ్యాధులకు దూరంగా జీవించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ అఖిల్ మహాజన్, జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలిరాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.