మంచిర్యాలటౌన్, నవంబర్ 25 : మంచిర్యాల మున్సిపాలిటీకి చెందిన నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు తీసుకెళ్లగా, మంత్రి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 20వ వార్డు కౌన్సిలర్ అంకం నరేశ్, 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత, మల్లేశ్ దంపతులు, 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి, శ్రీనివాస్ దంపతులు, ఏడో వార్డు కౌన్సిలర్ బాదావత్ ప్రకాశ్ ఉన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరి వెంట ఎమ్మెల్యే తనయుడు విజిత్రావు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పల్లపు తిరుపతి, మాజీ అధ్యక్షుడు గాదె సత్యం, ప్రధాన కార్యదర్శి గడప రాకేశ్ ఉన్నారు. కాగా నలుగురు కౌన్సిలర్లు ఒకేసారి పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయ్యింది. మున్సిపాలిటీలో 36 కౌన్సిల్ స్థానాలకు 22 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉండగా, 14 మంది కాంగ్రెస్కు చెందిన వారు ఉన్నారు. కాంగ్రెస్కు రోజురోజుకూ ఆదరణ తగ్గడం, ఇక్కడ ప్రధాన నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అధిష్టానం కూడా పీఎస్ఆర్ను పట్టించుకోకపోవడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక ఆ పార్టీలో కొనసాగడం వృథాయే అన్న ఆలోచనతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్లో చేరిన నస్పూర్ కాంగ్రెస్ కౌన్సిలర్
నస్పూర్కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దివాకర్రావు ఆధ్వర్యంలో 14వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కేడీకే ప్రకాశ్రెడ్డికి తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నస్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించినట్లు ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఆయన వెంట నస్పూర్ పట్టణ ఉపాధ్యక్షుడు నౌండ్ల సంతోష్చారి, పార్టీ నాయకులున్నారు.