మంచిర్యాల : ఆదివాసీ కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ అన్నారు. మహాజన్ శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలోని మారుమూల గ్రామం కొల్లంగూడలో దేవాపూర్ పోలీసువారి ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన 300 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ, సహ పంక్తి భోజనం ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయన్నారు. తల్లిదండ్రులుతమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు.గిరిజనులకు ఎల్లవేళలా క్షేత్రస్థాయి పోలీస్ అధికారులు అందుబాటులో ఉండి వారికి ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ వారి ఉన్నతికి కృషిచేయాలని సూచించారు.
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారని, వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు.
ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు పోలీస్ మీకోసం ఉన్నారు అనే భరోసా కల్పించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఏసీపీ ఎడ్ల మహేశ్, మందమర్రి సీఐ ప్రమోద్ రావు, దేవాపూర్ ఎస్సై విజేందర్ లను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫొటోలతో ఉన్న పోస్టర్ విడుదల చేశారు.