మందమర్రి జనవరి 7: రామకృష్ణా‘పూర్’.. పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ ఆ ఊరు పూర్తిగా గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ గ్రామాన్ని 6వ వార్డుగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో విలీనం చేశారు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి.
మిషన్కాకతీయతో చెరువులకు జలకళ..
ఉమ్మడి పాలనలో వ్యవసాయమే దండగ అన్న పాలకులు, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో చెరువుల్లో తెగిపోయిన కట్టలు, పిచ్చి మొక్కల, ముళ్ల పొదలు పేరుకు పోయి నిరుపయోగంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంతాల్లోని చెరువులు పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకున్నాయి. ఫలితంగా కాలం ఏదైనా చెరువులు నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి.
మినీ ట్యాంక్బండ్తో చినబోయినికుంటకు మహర్దశ
మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మినీట్యాంక్ బండ్ల సుందరీకరణకు నిధులు కేటాయిస్తున్నది. దశాబ్దాలుగా ఎలాంటి ఆలనాపాలన లేక పూర్తిగా నిరుపయోగంగా మారిన మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో గల ఊరు రామకృష్ణాపూర్లోని చినబోయినికుంట చెరువు కొత్తశోభను సంతరించుకున్నది. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ ద్వారా చెరువు అభివృద్ధికి రూ.60 లక్షల నిధులను కేటాయించింది. దీంతో చెరువులో పూడిక తొలగింపుతో పాటు చెరువు కట్ట వెడల్పు పెంచడం, చెరువులో నీరు నిలిచేలా మట్టిని తొలగించడం, మత్తడి మరమ్మతు పనులు తదితర పనులను చేపట్టారు.
దీంతో దశాబ్దాలుగా నీరులేక వెలవెలబోయిన చెరువు నేడు నీటితో కళకళలాడుతున్నది. గ్రామస్తుల వినతి మేరకు చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చెరువు కట్టను మినీ ట్యాంక్బండ్గా మార్చాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ప్రత్యేక చొరవ తీసుకొని పట్టణ ప్రగతి నిధులతో మినీ ట్యాంక్బండ్ (చెరువు కట్ట) సుందరీకరణ పనులను చేపట్టారు. అందుకు రూ.12 లక్షల నిధులను కేటాయించారు. చెరువు కట్టపై ఐరన్ రైలింగ్, వాకింగ్ ట్రాక్, ఎల్ఈడీ సోలార్ లైటింగ్, సోలార్ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఘాట్ను నిర్మించారు. రాత్రి సమయంలో రంగురంగుల లైట్లు కనుల విందు చేస్తున్నాయి. మినీ ట్యాంక్బండ్ వద్ద రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్ను ఏర్పాటుతో యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మా చెరువును ఎవరూ పట్టించుకోలే..
గతంలో మా ఊరు చెరువును ఎవరూ పట్టించుకోలేదు. వర్షాకాలం మినహాయిస్తే మిగతా కాలాల్లో చెరువులో నీటి చుక్క ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం మా చెరువుకు కొత్త రూపును తెచ్చింది. మిషన్ కాకతీయలో చేపట్టిన అభివృద్ధి పనుల తరువాత చెరువులో ఎప్పుడూ నీరు ఉంటుంది. మినీ ట్యాంక్బండ్ నిర్మాణంతో మరింత ఆకర్షణీయంగా మారింది. చెరువు అభివృద్ధికి చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన కృషి మరువ లేనిది.
మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో కొత్తందం..
నాడు మా ఊరు చెరువును ఎవరూ. పట్టించుకోక కనీసం కట్ట పై నుంచి నడిచే పరిస్థితి ఉండేది కాదు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో చెరువు కొత్త రూపును సంతరించుకున్నది. మినీ ట్యాంక్బండ్ నిర్మాణం,
సుందరీకరణ పనులతో ఆహ్లాదకరంగా మారింది. మిషన్ కాకతీయ పథకంలో పూడికను తొలగించడంతో నీటితో కళకళలాడుతున్నది. ఓపెన్జిమ్ మా ఊరి యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు రుణపడి ఉంటాం.
మరిన్ని పనులకు ప్రతిపాదనలు పంపించాం..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఊరు రామకృష్ణాపూర్ గ్రామ చెరువు కట్టను మినీ ట్యాంకుబండ్గా తీర్చిదిద్దాం. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచనల మేరకు పట్టణ ప్రగతి నిధులను కేటాయించి ప్రజల సౌకర్యార్థం పనులను త్వరగా పూర్తి చేశాం. మినీట్యాంక్బండ్ సమీపంలో మరో రూ.5 లక్షలను వెచ్చించి చిల్డ్రన్ పార్క్ నిర్మాణానికి పతిపాదనలు పంపించాం. సోలార్ లైటింగ్, రైలింగ్, ఓపెన్జిమ్ పరికరాలకు గ్రామస్తులు రక్షణ కల్పించాలి.