తాండూర్, ఏప్రిల్ 30 : సైబర్ మోసాలు, సోషల్ మీడియా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాళ్లూరు సీఐ దేవయ్య అన్నారు. రామగుండం కమిషనరేట్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం తాండూర్ సీఐ దేవయ్య, ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్ఛలాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 40 బైక్లను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు.
ఫేక్ కాల్స్, ఫిషింగ్ సందేశాలు, సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 సేవలను వినియోగించాలని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని వివరించారు. యువత ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు.
రైతులు నకిలీ విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ధృవీకరించిన విక్రేతల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, వరకట్నం వంటి సామాజిక దుష్ప్రవర్తనలను నిరోధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం స్వీయరక్షణ, నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు.
పోలీసులు ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం, నేరాలను నివారించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్, మాదారం, భీమిని, కన్నెపల్లి ఎస్ఐ లు ప్రసాద్, సౌజన్య, కోటేశ్వర్, భాస్కర్ రావు, సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.