Chennur | మంచిర్యాల జిల్లాలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గం హర్ష కనిపించకుండాపోయాడు. గురువారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్గం హరికిషన్, మమత దంపతుల కుమారుడు దుర్గం హర్ష గత మూడేళ్లుగా మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో చదువుతున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించడం లేదు. ఇది గుర్తించిన పాఠశాల సిబ్బంది బాలుడి కోసం గాలింపు చేపట్టారు. రాత్రి సుమారు 9 గంటల వరకు బాలుడి కోసం వెతికిన సిబ్బంది.. చివరకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని బాలుడి ఆచూకీ కోసం ఆందోళన చేపట్టారు. కాగా బాలుడి మిస్సింగ్పై ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.