మంచిర్యాల అర్బన్ 8 : వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం టికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.
ఈ సమయంలో వరకట్నం కింద 9 తులాల బంగారం, రూ .5 లక్షల కట్నంతో పాటు ఇతర వంట సామగ్రి అందజేశారు. వివాహ సమయంలో ఒప్పుకున్న దాని ప్రకారం లాంచనాలు ఇచ్చి పెళ్లి జరిపించారు. అయితే పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.
దీంతో శృతి భర్త సాయికి నిన్న (సోమవారం) రాత్రి 50 వేల రూపాయలు అందజేసి మిగతా సొమ్మును తొందరలో ఇస్తామని నచ్చజెప్పి శృతి తల్లిదండ్రులు టీకనపల్లి గ్రామానికి తిరిగి వెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన శృతి తెల్లవారుజామున 6 గంటల సమయంలో అత్తగారిం ట్లోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు శృతి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శృతి ఆత్మహత్యకు కారకులైన అత్త, మామ, భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.