కౌటాల, జూన్ 6: రైతు శ్రేయస్సుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మొగఢ్దగఢ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌటాల, చింతలమానేపల్లి ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డుబ్బుల నానయ్య, డీసీఎంఎస్ వైస్చైర్మన్ కుమ్రం మాంతయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఏఈవో అంజన్న, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మహా నిత్యాన్నదాన భవన ముఖద్వారం ప్రతిష్టాపన
కాగజ్నగర్టౌన్, జూన్ 6: పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మహానిత్యాన్నదాన భవన నిర్మాణానికి ముఖద్వారం ప్రతిష్ఠించి ఆదివారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, కూతురు ప్రతిమ ప్రత్యేక పూజలు చేసి భవనంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం ఆయా మండలాలు, ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కోనేరు చారిటుబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యాన్నదాన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కోనేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ, కుటుంబ సభ్యులు , టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.