ప్రమాదంలో గాయపడినా, ఏదో అనుకోని ఘటన జరిగి రక్తస్రావమైనా, ఇంకే ప్రాణాపాయమైనా.. ప్రథమ చికిత్సా విధానం తెలిసుండాలి. అప్పుడే మన, ఇతరుల ప్రాణాలను రక్షించిన వారమవుతాం. బొగ్గుగనుల్లో ఇప్పటిదాకా ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. అందులో ఎందరివో ప్రాణాలు గాల్లో కలిశాయి. దీనికి ప్రధాన కారణం సకాలంలో ప్రథమ చికిత్స అందకపోవడమే. ఈ ఫస్ట్ ఎయిడ్ గురించి తోటి కార్మికులకు తెలియకపోవడమే. దీనిని గుర్తించిన సింగరేణి.. గనిలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు తోటి కార్మికుల ప్రాణాలు కాపాడాలంటే ‘కార్మికుడే ప్రథమ వైద్యుడు’ కావాలన్న లక్ష్యంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోలిండియాలోనే మొదటిసారిగా కార్మికులకు ‘ప్రథమ చికిత్సా విధానం’పై ఆర్జీ-2లో శిక్షణ ప్రారంభించింది. పది రోజులకో బ్యాచ్కు ట్రైనింగ్ ఇస్తూ, మానసిక ధైర్యాన్ని నింపుతున్నది.
సింగరేణి గనుల్లో అప్పుడప్పుడు హఠాత్ పరిణామాలు చోటుచేసుకుంటాయి. గుండెపోటు, శ్వాస సంబంధిత ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతర ప్రమాదాల్లో గాయాలు తదితరవి పని స్థలాల్లో కార్మికులకు ఎదురవుతుంటాయి. మొన్నటి వరకు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో చికిత్స అందించాలంటే బాధితులకు గంటలు గడిచేవి. అక్కడి కార్మికులు రెస్క్యూ సిబ్బందికి సమచారం ఇచ్చి, రప్పించే సరికి కాలయాపన జరిగేది. తర్వాత గాయపడిన కార్మికుడు లేదా కార్మికులకు ప్రథమ చికిత్స అంది స్తూ, గనిపైకి తీసుకువచ్చి దవాఖానకు తీసుకుపోవడానికి ఎంతో సమయం పట్టేది. ఈ లోగా పరిస్థితి చేజారితే మార్గమధ్యంలోనే ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇదంతా గతం. ఇకపై పరిస్థితి మారిపోనుంది. ఎందుకంటే.. గనిలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కార్మికుల ప్రాణా లు కాపాడాలంటే తోటి కార్మికుడే ప్రథమ వైద్యుడు కావాలన్న లక్ష్యంతో సరికొత్త కార్యక్రమానికి సింగరేణి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కోలిండియాలోనే మొదటగా ప్రథమ చికిత్సపై కార్మికులకు శిక్షణ ఇస్తున్నది. అం దుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అనుమతి ఇవ్వగా, రామగుండం 2 డివిజన్లో ప్రప్రథమంగా కార్మికులకు ‘ప్రథమ చికిత్స’పై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నది.
పది రోజులపాటు శిక్షణ..
సింగరేణి ఆర్జీ2 ఏరియాలో ప్రథమ చికిత్సపై 11 ఏరియాలకు చెందిన కార్మికులకు బ్యాచ్ల వారీగా సింగరేణి వైద్యులు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం 1500 దరఖాస్తులు రాగా, వీరిలో ప్రాధాన్యతను బట్టి ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 8న సంస్థ డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం మొదటి బ్యాచ్కు ట్రైనింగ్ ప్రారంభించారు. ముం దుగా రెండు రోజులు 200 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. అందులో ప్రాక్టికల్లో 160 మార్కులకు 50 శాతం మార్కులు, ఓవరాల్గా 40 మార్కులకు 20 శాతం మార్కులు వచ్చి న వారికి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. మొదటి బ్యాచ్లో మొత్తం 82 మంది ఈ నెల 22న శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 67 మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించలేకపోయిన 15 మందికి మరో అవకాశం ఇవ్వనున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఆర్జీ-1 నుంచి 30 మంది, ఆర్జీ-2 నుంచి 9 మంది, ఆర్జీ-3 నుంచి 9 మంది, బెల్లంపల్లి నుంచి ఒకరు, మందమర్రి నుంచి 11 మంది, శ్రీరాంపూర్ నుంచి 13 మంది, కొత్తగూడెం కార్పొరేట్ నుంచి ఒకరు, భూపాలపల్లి నుంచి 8 మంది శిక్షణలో పాల్గొన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి కాగా, ఈ నెల 21 నుంచి రెండో బ్యాచ్కు శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణ అంశాలివే..
గనిలో ప్రమాదాలు జరిగినప్పుడు మొదటగా తోటి కార్మికుడే ప్రథమ చికిత్స అందించాలన్న ఉద్దేశ్యంతో శిక్షణ ఇస్తున్నారు. గుండెపోటు, గాయాలు, శ్వాసకోశ, ప్రమాదంలో గాయపడితే వైద్యశాలకు తరలించడం, ఆ సమయంలో చేసే ప్రథమ చికిత్స.. తదితర అంశాలపై తర్ఫీదునిచ్చారు. కార్మికులు పని స్థలాల్లో సాధారణంగా గుండెనొప్పికి గురవుతుంటారు. ఆ సమయంలో సీఆర్పీ చేసి రక్షించే విధానం, గాయాలైన వ్యక్తికి రక్తస్రావం కాకుండా, ఎప్పుడైనా ప్రమాదంలో ఎముకలు విరిగినప్పుడు తీసుకునే జాగ్రత్తలు, గనిలో గ్యాస్ వచ్చి కార్మికులు అస్వస్థతకు గురైతే వెంటనే కృత్రిమ శ్వాస అందించే పద్ధతి, ఫిట్స్ వస్తే లాలాజలం ఊపిరితిత్తులకు వెళ్లకుండా తలను ఒకవైపు తిప్పి ఉంచే విధానం, వడదెబ్బ తగిలినప్పుడు అప్పటికప్పుడు తీసుకొనే జాగ్రత్తలపై కార్మికులకు తర్ఫీదునిచ్చారు.
శిక్షణతో మానసిక ధైర్యం..
ప్రథమ చికిత్సలో సింగరేణి ఇచ్చిన శిక్షణతో మానసిక ధైర్యం పెరిగింది. పని స్థలాల్లో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే గాయపడిన తోటి కార్మికుడికి వైద్యం చేసే అవకాశం కలిగింది. గనిలోనే గాకుండా ఎక్కడైనా మా కండ్ల ముందు ఎవరైనా గాయపడితే ప్రథమ చికిత్స అందించవచ్చు. సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది.
ఎంతో నేర్చుకున్నం..
ఈ పది రోజుల శిక్షణలో చాలా నేర్చుకున్నం. ఇదివరకు పని స్థలాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే పై ఆఫీసర్లకు సమాచారం ఇచ్చేటోళ్లం. వాళ్లు వైద్య సిబ్బందికి సమాచారమిచ్చి సంఘటన స్థలానికి వచ్చేసరికి చాలా సమ యం పట్టేది. అప్పటికీ గాయపడ్డ కార్మికుడు ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించవచ్చు. ఈ రకంగా ప్రతి కార్మికుడిలో మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది.