దస్తురాబాద్, అక్టోబర్ 1 : రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు, సాగు నీటి సౌకర్యం కల్పిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తూ రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను విడుతల వారీగా మాఫీ చేస్తున్నారు.
రూ. 5 కోట్ల 89 లక్షలు మాఫీ
మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 1725 మంది రైతులు రూ. 10 కోట్ల 49 లక్షల రుణాలు తీసుకున్నారు. ప్రసుత్తం 1297 మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం రూ. 5 కోట్ల 89 లక్షలు రుణమాఫీ కింద జమ చేసింది. ఇంకా 428 మంది రైతులకు రూ. 4 కోట్ల 60 లక్షల విడుతల వారీగా జమ చేయనున్నది.
అన్నదాతకు చేయూత
రైతు శ్రేయస్సు కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం తాజాగా తీసుకన్న నిర్ణయం అన్నదాతలకు చేయూతనిచ్చింది. అప్పుల్లో చిక్కుకున్న అన్నదాతకు ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రూ. లక్ష లోపు, లక్ష పైగా పంట రుణాలను మాఫీ చేస్తున్నది. సీఎం కేసీఆర్ పంట రుణ మాఫీ చేసి రైతు బాంధవుడయ్యారు.
రైతుల ఖాతాల్లో రూ. 5 కోట్ల 89 లక్షలు జమ
తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 1725 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించి రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను జమ చేస్తున్నది. ఇప్పటి వరకు 1297 మంది రైతుల ఖాతాల్లో రూ. 5 కోట్ల 89 లక్షలు రుణమాఫీ కింద జమ చేసింది. రూ. లక్ష లోపు, లక్షకు పైగా పంట రుణం తీసుకున్న రైతులకు విడుతల వారీగా ప్రభుత్వం డబ్బులను జమ చేస్తున్నది. రుణ మాఫీ అయిన రైతులకు కొత్తగా పంట రుణాలను అందజేస్తున్నాం. 100 మందికి పైగా రైతులకు కొత్త రుణాలను మంజూరు చేశాం. రైతు రుణమాఫితో రైతులకు ఆర్థిక భారం తగ్గనున్నది.
-స్వామి, బ్రాంచ్ మేనేజర్, (టీజీబీ దస్తురాబాద్)
రూ. 41,333 రుణ మాఫీ అయ్యింది
గతంలో ఏ ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి ఆలోచన చెయ్యలేదు. రైతుల పక్షాన నిలబడిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం పెద్దమనస్సుతో రైతుల రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. నాకు రూ. 41,333 బ్యాంక్ రుణం మాఫీ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు.రుణ మాఫీ చేసి రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించాడు. రైతాంగం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుంది.
-గడ్డం పెద్ద కొమురయ్య,రైతు(రేవోజిపేట)
రుణ మాఫీతో ఎంతో ధీమా..
రైతు రుణ మాఫీతో ఎంతో ధీమాగా ఉంది. రైతులకు రూ. లక్ష వరకు రుణ మాఫీ చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్. రుణ మాఫీ ప్రకటించి మాఫి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు రెండు సార్లు రుణ మాఫీ అయ్యింది. ఈ సారి రూ. 79 వేల బ్యాంక్ రుణం మాఫీ అయ్యింది. సీఎం కేసీఆర్ ఎరువులు, విత్తనాలు, రైతు బంధు తదితర ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ చేశారు. రైతులకు ఆర్థిక భారం పడకుండా రుణ మాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు.
-దేశవేణి నర్సయ్య,రైతు(రాంపూర్)