నేరడిగొండ, జనవరి 17 : రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహిస్తున్న కంటి వెలుగును కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న వారు శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం శిబిరాల నిర్వహణ ఖర్చులకు గాను 32 పంచాయతీలకు రూ.32 వేలు ఎంపీడీవో కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఎంపీడీవో అబ్దుల్ సమద్,ఎంపీవో శోభన, వైద్యులు సద్దాం, సర్పంచ్ పెంట వెంకటరమణ, కార్యదర్శులు, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్లో కంటి వెలుగు ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయించినట్లు సర్పంచ్ జీ సురేందర్ యాదవ్, సొనాల పీహెచ్సీ డాక్టర్ కే నవీన్రెడ్డి తెలిపారు. బోథ్లో ప్రారంభానికి కావాల్సిన ఏర్పాట్లు మంగళవారం పూర్తి చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందిస్తారన్నారు. ఈ నెల 19 స్థానిక మార్కెట్ యార్డులో ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి అంజయ్య, సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో సాయిప్రసాద్ అన్నారు. గాదిగూడ రైతు వేదిక భవనంలో ప్రజాప్రతినిధులు,అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చూడాలన్నారు. గ్రామాల్లో కంటి సమస్య ఉన్న వారిని గుర్తించి పరీక్ష చేయించాలన్నారు. గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం ఎంపీపీ ఆడా చంద్రకళరాజేశ్వర్ మాట్లాడారు. అంధత్వ నివారణకు ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అందరి సహకారంతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ ఆర్కా మోతీరామ్, వైద్యుడు సంజీవ్, ప్రజాప్రతినిధులు,వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శైలజ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలకు వెళ్లే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకువెళ్లాలని సూచించారు. పట్టణంలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.