మిర్యాలగూడ రూరల్ : అక్టోబర్ 4 : రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కాల్వపల్లితండాలో ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అనంతరం రూ.90 లక్షలతో నిర్మించనున్న మూడు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్నదన్నారు.
గృహలక్ష్మి పథకం కింద అర్హులకు రూ.3 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు పావలా వడ్డీతో రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుబ్బారెడ్డిగూడెంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నూతన గ్రామపంచాయతీలో పంచాయతీ భవన నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదులుయాదవ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గడగోజు ఏడుకొండల్, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, సర్పంచ్లు గజ్జెల జయమ్మాకోటిరెడ్డి , నామ అలెగ్జాండర్, మంజ్యానాయక్, లింగయ్య, భిక్షానాయక్ పాల్గొన్నారు.