హాజీపూర్, అక్టోబర్ 13 : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 9,243 మంది అభ్యర్థుల కోసం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో 20, నస్పూర్లో 1, బెల్లంపల్లిలో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఏఎల్వోలు, 8 రూట్లలో లైజనింగ్ అధికారులతో పాటు మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమించామన్నారు.
అభ్యర్థులు రెండు గంటల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట వీడియో చిత్రీకరణ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 6,072 మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగిలిన అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 16న(ఆదివారం) ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8: 30 గంటల నుంచి కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.
ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. దివ్యాంగ అభ్యర్థులు గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంధులైన అభ్యుర్థులకు అదనంగా 20 నిమిషాల సమయం కేటాయిస్తామని చెప్పారు. అంధ విద్యార్థులు 19 మంది సహాయకులు కావాలని కోరారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. కేంద్రాల్లో విద్యుత్ సరఫరా, మూత్రశాలలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవి..
అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలి
ఆసిఫాబాద్, అక్టోబర్13 : గూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్ కుమార్ సయుక్తంగా ఒక ప్రకటనలో గురువారం కోరారు. జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, ముఖ్య పర్యవేక్షకులు, లైజన్, సహాయ లైజన్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్, ఇన్విజిలేటర్లు ,సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం చూసుకోవాలని తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ మొదలవుతుందని తెలిపారు. ఉదయం 10.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేస్తామని పేర్కొన్నారు. అర నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని సృష్టం చేశారు. మరింత సమాచారం కోసం టీఎస్పీఎస్సీ టోల్ ఫ్రీ నం. 18004253424, జిల్లా హెల్ప్లైన్ నం.18005991200, 08733279333లలో సంప్రదించవచ్చని సూచించారు.