కడెం, ఆగస్టు 12 : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. లక్ష్మీపూర్లో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయకులు, రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కడెం మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని అడిగిన వెంటనే మంజూరుచేసిన ముఖ్యమంత్రి, రైతుల పక్షాన ఉంటూ వారికి లబ్ధి చేకూరుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రూ.40 కోట్ల మంజూరుకు అనుమతులు ఇచ్చిందన్నారు. దీంతో లక్ష్మీపూర్తో పాటు నవాబుపేట్, దోస్తునగర్, ఆకొండపేట్ గ్రామాల్లోని 3500 ఎకరాలు సాగులోకి రానుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడెం, కొండుకూర్, నవాబుపేట్ సర్పంచులు కొండాపురం అనూష, గొల్ల వేణుగోపాల్, విజయ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, ఎంపీపీ అలెగ్జాండర్, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్ రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.