కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 6: గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడుతుందని గాని, ఈ జిల్లాకు మెడికల్ కళాశాల వస్తుందని గాని ఎవరూ ఊహించి ఉండరు. ఊహలకందని అభివృద్ధిని నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించారు. చెప్పిన విధంగానే ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో బుధవారం అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. వంద సీట్లకు గాను అడ్మిషన్లను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో సీట్లు రావడంతో చేరేందుకు తరలివస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకొని అడ్మిషన్ తీసుకుంటున్నారు. మరోవైపు కళాశాల భవన నిర్మాణం తుది దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో పూర్తి కానుంది. తరగతి గదులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు సమకూరుస్తున్నారు. హాస్టల్, లైబ్రరీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కావడంతో ప్రభుత్వం రూ. 1000 కోట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జిల్లా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. గత బడ్జెట్ సమావేశాల్లో మెడికల్ కళాశాలకు నిధులు మంజూరు కావడంతో నిర్మాణాన్ని అధికారులు ప్రారంభించారు. జూన్ నాటికి మెడికల్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల 26 మంది ప్రొఫెసర్లను కూడా కళాశాలకు కేటాయించింది. మెడికల్ కళాశాలతోపాటు జిల్లాకేంద్రంలోని దవాఖానకు డయాలసిస్ సెంటర్ను మంజూరు చేసింది. రూ. 54 కోట్లతో 300 పడకల ఏరియా దవాఖానను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి.
స్థానికంగానే ఎంబీబీఎస్ చేస్తున్న..
మాది ఆసిఫాబాద్ మండలం లోని అడ గ్రామం. ఇంట ర్ వరకు మియాపూర్ లోని ఓ ప్రైవేట్ కళశాల లో చదివా. నీట్ రాశాను. మెడికల్ కాలేజీ ఎక్కడో దూర ప్రాంతం లో వస్తుందని భయపడ్డా. కానీ మా జిల్లాలోనే కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కశాలలో సీటు వచ్చింది. స్థానికంగా కాలేజీ సీటు రావడం సం తోషంగా ఉంది. నాకు లక్షా 59వ ర్యాంకు వచ్చింది. ఆసిఫాబాద్ మెడికల్ కళాశాల రావడం వల్లే స్థానికంగా ఎంబీబీఎస్ చేయగలుతున్న.
-ఆదే శ్రీనిత్య, అడ గ్రామం, ఆసిఫాబాద్
నా కల నెరవేరింది
నాది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం పులిమడుగు గ్రామం. నాకు ఆసిఫాబాద్ మెడికల్ కాళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉంది. మా నాన్న ఉట్నూర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తు న్నారు. పదోతరగతి వరకు ఉట్నూర్లోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదివాను. ఆ తరువాత ఇంటర్ కరీంనగర్లోని ట్రినిటి కాలేజీలో చదివిన. నీట్లో 2లక్షల 2917 ర్యాంకు వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది.
-రాథోడ్ శైలజ, పులిమడుగు
సీటు రావడం సంతోషంగా ఉంది
మాది ఆసిఫాబాద్ జిల్లా రేచిని గ్రామం, పదో తరగతి వరకు రేచిని ప్రభుత్వ పాఠశాలలో చదివా. ఇంటర్ నల్గొండలోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో చదివా. నీట్లో 499 మార్కులు వచ్చాయి. నాకు ఆసిఫాబాద్ జిల్లాలోని కొత్త కళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉంది. నా చదువు మొత్తం ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది. ప్రభుత్వం కల్పించిన వసతులతో నేను ఎలాంటి ఖర్చులు లేకుండా ఎంబీబీఎస్ చదువగలుగుతున్న.
-కుమార్, రేచిని