ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 8 : లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సెక్టార్ అధికారులు, ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో నియమించిన సెక్టార్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు సెక్టార్ అధికారుల పాత్ర కీలకమైనదని అన్నారు. సెక్టార్ అధికారులు తమకు అందించిన హ్యాండ్ బుక్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తెలుసుకొని ఉండాలని, పోలింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ ముందు రోజు సిబ్బందిని సురక్షితంగా తరలించాలని, ఓటింగ్ ప్రారంభానికి ముందే మాక్ పోలింగ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని సహాయ ఎన్నికల అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో ఏదైనా సమస్య తలెత్తినట్లయితే సంబంధిత అధికారుల సమన్వయంతో తమ వద్ద అదనంగా ఉన్న బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను వినియోగించి సమస్యను తక్షణమే పరిషరించి పోలింగ్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెక్టార్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లు, ఇతర వివరాలపై నివేదిక అందించాలని ఆదేశించారు.
ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మండల అధికారులు లోకేశ్వర్రావు, కాసబోయిన సురేశ్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, మాస్టర్ ట్రైనర్లు, తహసీల్దార్లు, సెక్టార్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
నిరంతర తాగునీటి సరాఫరాకు చర్యలు
తిర్యాణి, ఏప్రిల్ 8 : వేసవికాలం దృష్ట్యా జూన్ వరకు నిరంతరాయంగా తాగునీరు అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, పంచాయతీ అధికారి సుదర్శన్ గౌడ్, అధికారులతో కలిసి ఉపాధి హామీ పనుల నిర్వహణ, తాగునీటి సరాఫరా, వడదెబ్బ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. అంతకుముందు మొర్రిగూడ గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. తిర్యాణి నుంచి త్రీంఇైక్లెయిన్ వరకు దెబ్బతిన్న రోడ్డును బాగు చేయించాలని ఆటో యూనియన్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. అలాగే మండల కేంద్రంలోని ఆర్ఐ, ఏఎన్ఎం (సబ్సెంటర్) భవనాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజన మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం రెం డు, మూడేళ్ల క్రితం లబ్ధిదారులకు మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, సుమారు 7లక్షల వరకు మంజురైన నిధులు లబ్ధిదారులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్ కాజేశాడని తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులకు డబ్బులు వచ్చేల చర్యలు చేపట్టాలని మాజీ ఉపసర్పంచ్ లచ్చయ్య కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో డీఎల్పీవో సురేందర్, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో మల్లేశ్, ఎంపీవో సుధాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.