దహెగాం, డిసెంబర్ 17 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో ఆదివారం ఆటోవాలాలు బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.
ఆటోలకు గిరాకీ తగ్గిందంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం వెంటనే సదరు పథకాన్ని రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల శాఖ అధ్యక్షుడు లోనారి రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.