కుమ్రం భీం ఆసిఫాబాద్ : రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ పోలీసులకు సూచించారు. రాబోయే ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలైన, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గాలకు డీఎస్పీలు ఇన్చార్జీలుగా ఉండి బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. ఎన్నికల విధులపై పూర్తి అవగహనతో పనిచేయాలన్నారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్ చేయాలని తెలిపారు.
ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ ఇంచార్జ్ (రెవెన్యూ శాఖ) మధుకర్, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, డి.సి.ఆర్.బి డీఎస్పీ రమేశ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.