కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమంగా కలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.
పంగిడిమాధర వైపు నుంచి ఆసిఫాబాద్ వైపు ఓ వాహనంలో కలపను తరలిస్తుండగా అటవీ అధికారులు వాహనాన్ని వెంబడించారు. అయితే అధికారులకు కల్లు కప్పి వాహనం డొర్లీ గ్రామంలోకి వెళ్లింది.
కాగా, ఓ పెద్ద లోయలో వాహనాన్ని వదిలి డ్రైవర్ పారిపోయాడు. అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని దుంగలు రేంజ్ కార్యాలయానికి తరలించారు.
వాహనంలో 18 దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అప్పలకొండ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా కలపను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి యోగేష్, ప్రవీణ్ కుమార్, ఝాన్సీ రాణి, తిర్యానీ రేంజ్ సెక్షన్ అధికారులు విజయ్ కుమార్, మహేందర్, బీట్ అధికారులు స్వప్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.