కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పాడైపోయిన రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రోడ్లు భవనాల శాఖ ఈఈ పెద్దయ్య, పంచాయతీ రాజ్ డీఈ కృష్ణతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చెడిపోయిన రోడ్లను గుర్తించి అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. గతంలో అప్పగించిన పనులను చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో ఉంచాలని ఆదేశించారు. నంబాల నుంచి నారాయణపూర్ రోడ్డు నిర్మాణం క్సోం కేంద్రం నుంచి 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, పనులు మొదలు పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అటవీశాఖ అనుమతులు రాని ప్రాంతాన్ని మినహాయించి అనుమతులు కలిగిన మిగతా పనులను మొదలు పెట్టాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికలకు మిషన్ భగీరథ పథకం కింద నల్లా కనెక్షన్ అందించి నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.