కుమురం భీం ఆసిఫాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేసేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల పేరుతో సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రటరీ వెలిశాల క్రిష్ణమాచారిని ఆయన స్వగ్రామమైన చింతకుంటలో ఉదయం 5 గంటల సమయంలో పోలీసులు ఇంటికెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా భావిస్తున్నామని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రంగాల కార్మికులకు ఇచ్చిన హామీల అమలు, కనీస వేతనాల పెంపు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లను వినిపించేందుకు మాత్రమే వెళ్లాలనుకున్న కార్మిక నాయకులను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడం, నిరసనలు తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కులని, ఆ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు.