కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : భారీ వర్షాల దృష్ట్వా జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా మండలాల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోవు 48 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
జిల్లాలో అధిక వర్షపాతం నమోదయ్యే మండలాలైన చింతల మానేపల్లి, పెంచికల్ పేట, జైనూర్, తిర్యాణి, కెరమెరి, లింగాపూర్, రెబ్బెన ప్రాంతాలలో ఉప్పొంగుతున్న వాగులు, కల్వర్టులు, వంతెనలు, రోడ్లను రెవెన్యూ, పోలీస్, పంచాయతీ బృందాలు నిరంతరం గస్తీ కాయాలన్నారు.
అత్యవసర సమయాలలో ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సహాయం కోనం 1800 599 1200, 08733 27933 నంబర్లలో సంప్రదించాలన్నారు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు.