కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
నమస్తే : జిల్లాలో దళితబంధు పథకం అమలు ఎంత వరకు వచ్చింది?
కలెక్టర్ : జిల్లాలో దళితబంధు పథకం అమలు కోసం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులకు పథకాన్ని అమలు చేయా ల్సి ఉంది. అయితే ఆసిఫాబాద్ నియోజకవర్గం లో గాదిగూడ, నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల్లోని దళితుల కోసం 25 యూనిట్లు కేటాయించాం. ఇక మన జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 8 మండలాలు, సిర్పూర్-(టీ) నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 175 యూనిట్లు మంజూరు చేస్తున్నాం.
నమస్తే : క్షేత్రస్థాయిలో అమలు ఎలా ఉంటుంది?
కలెక్టర్ : దళితబంధు పథకం అమలు కోసం జిల్లాలో లబ్ధిదారులను ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేస్తాం. దళితులు ఉన్న చిన్న గ్రామాలను మొదట ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపి క దాదాపు పూర్తికావచ్చింది. సిర్పూర్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక కోసం చర్యలు తీసుకుంటున్నాం. మొదట ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 10 మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించాం. కాగజ్నగర్ పెద్ద నియోజక వర్గం. ఇక్కడ ఇంకా లబ్ధిదారులను గుర్తించాల్సి ఉంది.
నమస్తే : దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఎప్పటి వరకు పూర్తికావచ్చు?
కలెక్టర్ : దళితబంధు పథకం అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి 5 నాటికి పూర్తిచేస్తాం. ఎంపిక పూర్తిగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంది. మార్చి నెలాఖరుకల్లా పథకాన్ని పూర్తిగా అమలు చేస్తాం. లబ్ధిదారులకు కావాల్సిన అవగాహన కల్పించడంతో పాటు, పథకం పూర్తిస్థాయలో సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. పథకం పొందిన ప్రతి దళితుడూ అభివృద్ధి సాధించేలా చూస్తాం.
నమస్తే : ఎన్ని నిధులు అవసరమవుతాయి?
కలెక్టర్ : జిల్లాలోని 15 మండలాల్లో దళితబంధు అమలుకు రూ. 17.50 కోట్లు అవసరమవుతాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని 8 మండలాలు, సిర్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 10 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పథకం ద్వారా యూనిట్లను అమలు చేస్తాం.
నమస్తే : పథకం అమలుకు ఏవైనా కమిటీలు వేస్తారా?
కలెక్టర్ : దళితబంధు పథకం అమలుకు మూడు స్థాయిల్లో కమిటీలు వేస్తాం. గ్రామ స్థాయిలో ఒక కమిటీ, మండల స్థాయిలో ఒకటి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో మరొకటి ఉంటుంది. లబ్ధిదారులకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లు తీసుకుంటాం. వారికి కావాల్సిన అవగాహన కల్పి స్తాం. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం. నియోజకవర్గానికి స్పెషల్ అధికారులను నియమిస్తాం. పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.
నమస్తే : ఎలాంటి యూనిట్ల అమలుకు ప్రధాన్యత ఇస్తారు.?
కలెక్టర్ : దళితబంధు పథకం ద్వారా మంచి యూనిట్లను అమలు చేస్తాం. వాటి ద్వారా పథకం పొందిన లబ్ధిదారులు అభివృద్ధి చెందేలా చూస్తాం. ఉదాహరణకు జిల్లాలో ఒక మంచి రెస్టారెంట్ లేదు. కొంత మంది లబ్ధిదారులను కలిపి ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసేలా చూస్తాం. పర్యాటకంగా ప్రాజెక్టు వద్ద బోటింగ్ ఏర్పాటు చేయిస్తాం. వారి ద్వారా అక్కడ పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు కల్పించి, వాటి ద్వారా లబ్ధిదారులకు ఆదాయం వచ్చేలా చూస్తాం అదేవిధంగా చేపల పెంపకం, వ్యవసాయ అనుబంధ, ట్రాన్స్పోర్టుకు సంబంధించిన యూనిట్లను అమలు చేస్తాం.