కుభీర్, జనవరి 26 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్ది(కే) గ్రామానికి చెందిన యువరైతు బందెల సత్యనారాయణకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. యేటా వానకాలంలో సోయా, పత్తి, కంది.. యాసంగిలో శనగ, మక్క సాగు చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు, నీరు అధికంగా ఉండడంతో ఎనిమిదేండ్ల క్రితం వరకు వరి, పత్తి వేశాడు. కాండం తొలిచే, గులాబీ పురుగులు అధికం కావడంతో వరి, పత్తి వేయడం మానేశాడు. దీనికితోడు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆరుతడి పంటలు వేయడం ఆరంభించాడు. గత వానకాలంలో 2 వేల తైవాన్ పింక్ జామ మొక్కలు కడప జిల్లా నుంచి ఒక్కొక్కటి రూ.65కు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. తనకున్న పన్నెండెకరాలకు గాను రెండున్నర ఎకరాల్లో నాటాడు. అంతర పంటగా, మిగతా భూమిలో పత్తి, సోయా వేశాడు. పత్తి ఉత్పత్తులు అమ్మగా రూ.2.07 లక్షలు.. సోయా విక్రయించగా రూ.1.25 లక్షలు వచ్చా యి. ఈ యాసంగిలో కూడా నాలుగెకరాల్లో శనగ, మరో నాలుగెకరాల్లో మక్క, మరో రెండున్నరెకరాల్లో కంది వేశా డు. పంట ఏపుగా ఉంది. జామ మొక్కలకు కావాల్సిన సస్యరక్షణ చర్యలు చేపడుతూనే.. అంతర పంటలు సాగు చేస్తూ ఆర్థిక లాభాలు గడిస్తున్నాడు. వచ్చే మార్చి నుంచి జామ కోతకు రానుంది. ఇది యేటా పంట వస్తూనే ఉం టుంది. కాగా.. యాసంగిలో వేసిన సోయా, కంది కోతకు వస్తున్నాయి. సోయా అమ్మితే రూ.90 వేలు, శనగ అమ్మితే ఒక లక్ష రూపాయలు వస్తాయని రైతు తెలిపాడు. శనగ పంట చేతికొచ్చాక ఫిబ్రవరి చివరలో టమాటను అంతర పంటగా సాగు చేసేందుకు నారు కూడా సిద్ధం చేశాడు. దీంతో మరో లక్ష ఆదాయం సమకూరనుందని తెలిపాడు.
నిరంతర కాత.. అధిక దిగుబడులు..
తైవాన్ జామ మొక్కలు నాటిన యేడాది నుంచి నిరంతరం కాత కాస్తూనే ఉంటాయి. ఒక మొక్కకు ప్రతిసారి కనీసం ఐదు కిలోల పండ్లు వస్తాయి. ఎకరానికి మొదటి సంవత్సరం 8-10 టన్నులు, రెండో యేడాది 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన మార్కెట్లో కనీ సం రూ.30కి కిలో చొప్పున ధర పలికితే.. ఏడాదికి రెండు సార్లు కాతకాసినా రూ.6 లక్షల ఆదాయం సమకూరుతుం ది. ఇలా ఒక్కసారి నాటిన జామ మొక్క ఎనిమిది నుంచి పదేండ్ల వరకు పంట కాస్తుంది. ప్రత్యామ్నాయ పంటలే రైతుకు లాభాలు చేకూరుస్తాయని పేర్కొంటున్నాడు.
దీర్ఘకాల పెట్టుబడితో అధిక రాబడి..
తైవాన్ జామ సాగు కోసం దీర్ఘ కాలిక పెట్టుబడి పెట్టాలి. 2 వేల మొక్కలు పెంచుతున్నా. మొదటి సంవత్సరం రూ.2.50 లక్షల పెట్టుబడి అవుతుంది. రెండో సంవత్సరం నుంచి పెట్టుబడి ఖర్చు రూ.60 నుండి 70 వేలు వస్తుంది. నాకు ఆదిలాబాద్కు చెందిన మంగపాటి మోహన్ ఆయన నాటిన తైవాన్ జామను చూపించారు. నన్ను ప్రోత్సహించాడు. ఇందులో అంతర పంటలను సాగు చేసి వాటి దిగుబడులతో వచ్చే ఆదాయాన్ని తైవాన్ జామ చెట్లు పెంపకానికి వినియోగిస్తున్నా.