హాస్పిటల్స్లో రోజు రోజుకూ పెరుగుతున్న సంఖ్య
ఈ ఏడాదిలో 5,786 నమోదు
ఇంటి వద్ద 14 మాత్రమే
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/ అంబేద్కర్ చౌక్ : రాష్ట్ర సర్కారు చేపడుతున్న కార్యక్రమాలకు తోడు వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీల ప్రత్యేక చొరవతో హాస్పిటల్ డెలివరీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఇంటి ప్రసవాలకే మొగ్గు చూపిన గిరిజన మహిళలు.. నేడు దవాఖాన కాన్పులకే మొగ్గు చూపుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 5,786 (98 శాతం) ప్రసవాలు హాస్పిటల్స్లోనే జరుగగా, కేవలం 14 మాత్రమే ఇంటివద్ద జరిగాయి.
నాడు ఇంటి ప్రసవాలకే మొగ్గుచూపిన గిరిజన మహిళలు నేడు దవాఖాన ప్రసవాలపై మొగ్గు చూపుతున్నారు. హోం డెలివరీలు అధికంగా నమోదయ్యే ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం 98 శాతం డెలివరీలు దవాఖానల్లోనే అవుతున్నాయి. గత జనవరి నుంచి నవంబర్ వరకు (11 నెలలు) 14 మాత్రమే ఇంటి ప్రసవాలు జరిగాయంటే.. దవాఖాన ప్రసవాలపై అవగాహన ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది.
సర్కారు దవాఖానల్లో సౌకల సౌకర్యాలు
రాష్ట్ర ప్రభుత్వం మారుమూల పల్లెల్లోని పీహెచ్సీలు మొదలుకొని జిల్లాకేంద్రంలోని సర్కారు దవాఖాన వరకు వైద్యానికి, డెలివరీలకు కావాల్సిన అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత ఇక్కడి ప్రభుత్వ దవాఖానల్లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. మండలానికో 108 అంబులెన్స్, గిరిజన ప్రాంతాల్లో 102 అమ్మఒడి అంబులెన్స్ లు అందుబాటులోకి తీసుకురాగా, గర్భిణులను దవాఖానల కు తరలించడం సులభమైంది. గతంలో దవాఖాన తీసుకురావాలంటే నరకం చవిచూడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేయగానే నిమిషాల వ్యవధిలో అంబులెన్స్లు గర్భిణులను దవాఖానలకు తరలిస్తున్నాయి. పట్టణ కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. ఏ సమయంలో డెలివరీ కేసులు వచ్చినా స్పందిస్తున్నారు.
పెరిగిన అవగాహన..
గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటి వద్ద ప్రసవాలు నిర్వహించడం వల్ల మాతా శిశు మరణాలు ఎక్కువ సంఖ్యలో ఉండేవి. వీటిని నిరోధించి, దవాఖాన ప్రసవాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నది. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు సమన్వయంతో పల్లెల్లో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు గిరిజన మహిళల్లో మంచి మార్పుని తీసుకువచ్చాయి. ముఖ్యంగా గర్భిణుల సమాచారం ఎప్పటికప్పుడు నమోదు చేయడం, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సిబ్బంది పర్యవేక్షిస్తుండడంతో హాస్పిటళ్లలో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ట్యాబ్లను అందించి గర్భిణుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు. గర్భిణులను క్రమం తప్పకుండా దవాఖానకు తీసుకెళ్లే బాధ్యతలను ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు తీసుకోవడంతో డెలివరీలు గణనీయంగా పెరిగాయి.
11 నెలల్లో 5804 ప్రసవాలు
జిల్లాలో జనవరి నుంచి నవంబర్ 25 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కలిపి 5804 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3190 ప్రసవాలు జరుగగా, ప్రైవేట్ దవాఖానల్లో 2338 ప్రసవాలు జరిగాయి. ఇక్కడి నుంచి పక్క రాష్ర్టాలకు వెళ్లి చేయించుకున్న డెలివరీలు 258 ఉన్నాయి. మరో 4 ప్రసవాలు ప్రయాణాల్లో జరిగాయి. ఇక 14 మాత్రమే ఇంటి ప్రసవాలు జరిగాయి.
ప్రభుత్వ దవాఖానల్లో..
జిల్లాలో అత్యధికంగా కాగజ్నగర్ సీహెచ్సీలో 551 ప్రసవా లు, కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 422 ప్రసవాలు, జైనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 345 ప్రసవాలు, జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో 258 ప్రసవాలు జరిగాయి. అడ పీహెచ్సీలో 28, బాబాపూర్ పీహెచ్సీలో 10, బెజ్జూర్ పీహెచ్సీలో 227, దహెగాంలో 93, ఈజ్గాంలో 30, గిన్నెధరిలో 47, కెరమెరిలో 319, లింగాపూర్లో 11, లోన్వెల్లిలో 13, పెంచికల్పేట్లో 22, రెబ్బనలో 92, రోంపల్లిలో 19, సిర్పూర్(టీ) 27, సిర్పూర్-యులో 258, తిర్యానిలో 77, వాంకిడిలో 341 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుత్రుల్లో జరిగిన అన్ని డెలివరీలు సాధారణ ప్రసవాలు కావడం విశేషం.
నార్మల్ డెలివరీ చేసిన్రు..
నేను గర్భంతో ఉంటే వైద్య సిబ్బంది నెలనెలా వచ్చి పరీక్షలు చేసి మందులు ఇ చ్చిన్రు. డెలివరీ ఎప్పుడో ముందుగల్నే చెప్పిన్రు. నాకు బుధవారం (24వ తేదీ) రాత్రి నొప్పులు వచ్చినయ్. మా ఇంటోళ్లు 102 అంబులెన్స్కు ఫోన్ చేసి న్రు. మా ఊరు మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూ రంల ఉంటది. 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వ చ్చింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో కెరమెరి ప్రభుత్వ దవాఖాన కు తీసుకొచ్చిన్రు. డాక్టరు పరీక్షించి నార్మల్ డెలివరీ చేసి న్రు. ఇది నాకు రెండో కాన్పు. బిడ్డపుట్టింది. ఇప్పు డు బిడ్డా నేను ఆరోగ్యంగా ఉన్నం.