కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి అక్రమంగా కలపను క్వాలిస్ వాహనంలో( ఏపీ25ఏక్యూ 8419) చింతలమాధర వైపు నుంచి గోలేటి వైపు తరలించే క్రమంలో అటవీ అధికారులు వాహనాన్ని వెంబడించారు.
అటవీ అధికారుల కళ్లు కప్పి వాహనం ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతంలో గల తుమ్మ పొదలల్లో వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని దుంగలను రేంజ్ కార్యాలయానికి తరలించారు.
వాహనంలోని 21 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలు 0.688 సెంటి మీటర్లు ఉండి, 94,228 రూపాయల విలువ పలుకుతుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా కలపను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.