కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పుట్టిన ఊరు ఆసిఫాబాద్ మండలంలోని రౌట అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి తెలిపారు. మండలంలోని రౌట సంకెపల్లి పంచాయతీలోని పలు గ్రామాలను ఎంపీపీ మల్లికార్జున్ తో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీమ్ పుట్టిన ఊరు రౌట అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రామానికి రహదారి సౌకర్యం కోసం అన్ని చర్యలు చేపట్టామన్నారు. అలాగే గ్రామంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాగునీటి కోసం చెరువు తవ్వించనున్నట్లు వివరించారు. గ్రామంలో మినీ అంగన్వాడీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు గ్రామస్తులకు వివరించారు. అలాగే త్వరలోనే గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు పేర్కన్నారు.
అనంతరం ముంబై నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ కంపెనీ గ్రామాలను దత్తత తీసుకుంటానని తెలపడంతో కంపెనీ ప్రతినిధులతో కలిసి అడ్డాఘాట్, రౌట సంకేపెల్లి గ్రామాల్లో ప్రజలను కలిసి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అడ్డాఘాట్ గ్రామస్తులు తయారుచేస్తున్న వెదురు వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ప్రసాద్, ఏపీడి రామకృష్ణ, ఏపీవో చంద్రశేఖర్, సర్పంచ్ నిర్మల, పాల్గొన్నారు.