ఎదులాపురం, అక్టోబర్ 29 : అందరి అభివృద్ధికి కృషి చేస్తామని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో బొందిలి రాజ్పుత్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన దసరా మిలన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా మహారాణాప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. రాణాప్రతాప్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.
అనంతరం సంఘం సభ్యులకు ఐడీ కార్డులు అందజేశారు. రానున్న ఎన్నికల్లో జోగు రామన్నకు మద్దతు ఉంటుందని సభ్యులు తీర్మానం చేయగా వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను ఇస్తూ అందరి సంక్షేమం కోసం పాటు పడుతున్నామన్నారు. బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ కుటుంబాలతో కలిసి వచ్చి తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. బొందిలి రాజ్పుత్ సమాజ్ సంఘ భవన నిర్మాణ పనులను ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు విజయ్సింగ్, అధ్యక్షుడు స్వదీప్ సింగ్ ఠాకూర్, కార్యదర్శి సతీశ్, మహిళా విభాగం అధ్యక్షురాలు కాంతా దిక్షిత్, ప్రధాన కార్యదర్శి పల్లవి, యూత్ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్సింగ్, కార్యదర్శి జగత్సింగ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్లోని చిల్కూరి లక్ష్మీనగర్లో సంత్ రవిదాస్ సేవా సమాజ్ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. ముందుగా సంత్ రవిదాస్ చిత్రపటానికి పూజలు చేశారు. నూతన ఎన్నికైన సమాజ్ సభ్యులను సత్కరించారు. సంఘం అభివృద్ధికి తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాజ్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఎన్నికల్లో బీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంత్ రవిదాస్ సేవా సమాజ్ అధ్యక్షుడు రఘునాథ్, ప్రధాన కార్యదర్శి దాదారావ్, రఘునాథ్, ఎక్కర్, రాంజీ, రాజు ,కదం, సందీప్ పాల్గొన్నారు.