కుమ్రం భీం ఆసిఫాబాద్ , సెప్టెంబర్ 22 : జిల్లాలోని కాగజ్నగర్ మండలం మోసం ఎంపీటీసీ భీమన్కార్ శోభ భర్త మోహన్(48) బుధవారం రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మోసం- ఆరెగూడ గ్రామాల మధ్యలో పంట చేలలో పందుల బెడద ఉండడంతో కాపు కాసేందుకు ఆరెగూడకు చెందిన 8 మంది రైతులు బుధవారం రాత్రి వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి వర్షం పడుతుండడంతో భీమన్కార్ మోహన్, తుమ్మిడే గౌరయ్య, మానెపల్లి కృష్ణ, ఎల్ములే రవి, డోకే రాజేందర్, రోహిని మోసంబి చేనులో ఏర్పాటు చేసిన మంచె వైపు వెళ్లగా, మరో ఇద్దరు వేరే చోటుకు వెళ్లారు.
అదే సమయంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో ఆరుగురు అపస్మారక స్థితికి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత తేరుకున్న డోకే రాజేందర్ తోటి రైతులను పరిశీలించాడు. అందులో మోహన్ అప్పటికే మృతి చెందాడు. గాయపడిన వారిని ఈస్గాంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ఈస్గాం ఎస్ఐ జగదీశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.