జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరం
కుమ్రం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, సెప్టెంబర్ 26 : నిజాం రజాకారులు, భూస్వాములు, పెత్తందారుల అన్యాయాలను ఎదిరించి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి కొనియాడారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ రాహుల్రాజ్తో కలిసి పూలమాల వేసి నివాలర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాడు భూమి కోసం, భుక్తి కోసం నిజాం సర్కారుతో చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడిందని కీర్తించారు. అలాంటి వీర వనిత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల కూలాలు, మతాల వారి సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం : కలెక్టర్ భారతీ హోళికేరి
నిజాం సర్కార్ బానిసత్వ, అరాచక పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతంగ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తి దాయకమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. ఆదివారం 126వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం పాలనలో జరుగుతున్న అన్యాయాలను చాకలి ఐలమ్మ ధైర్యంగా ఎదిరించారని కొనియాడారు. సాయుధ రైతాంగ పోరాటంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సేవలు సైతం అందించారన్నారు. ఆమె జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. దేశం కోసం అన్ని వర్గాలకు చెందిన మహనీయులు పోరాడారని, వారిని ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీం అలీ అఫ్సర్తో పాటు రజక సంఘం నాయకులు అధికారులున్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో
వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్ర పటానికి జడ్పీ సీఈవో కాకరాల నరేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సూపరింటెండెంట్లు బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.