జైనూర్, అక్టోబర్ 24: గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రామగుండం ఇన్చార్జి కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం జైనూర్ పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సాగు అరికట్టేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి సాగు చేసే రైతుల పేరు రైతుబంధు జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. అసైన్డ్ భూముల్లో సాగు చేస్తే ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. అటవీ హక్కు పత్రాలు కలిగి ఉన్న రైతులు సాగు చేస్తే పట్టాలు రద్దు చేయిస్తామని, అయినా తీరు మారకపోతే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసు శాఖ డీజీపీ ఆదేశాల మెరకు దేశ భవిష్యత్, యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాలు, గంజాయి, గుట్కా లాంటి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసు స్టేషన్ పరిధీలోని పాన్షాపుల్లో విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. ఎవరైనా గంజాయి సాగు, రవాణా, విక్రయం, వాడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట జిల్లా పోలీసు శాఖ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఎస్డీపీవో శ్రీనివాస్, వాంకిడి సీఐ సుధాకర్, ఎస్ఐలు తిరుపతి, విష్ణువర్ధన్, మధు, రమేశ్ తదితరులున్నారు.
డ్రోన్ల సహాయంతో మారుమూల గ్రామాల్లో తనిఖీలు
సిర్పూర్(టీ), అక్టోబర్ 24 : మండలంలోని లింబుగూడ, మేడిపల్లి గ్రామాల్లో గంజాయి సాగుపై పోలిసులు డ్రోన్ల సహాయంతో విస్తృత తనిఖీ నిర్వహించారు. ప్రతి ఇంటిలో పోలిసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల్లో గంజాయి సాగుపై డ్రోన్ల సాయంతో తనిఖీ చేస్తున్నామని తెలిపారు. గంజాయి సాగు చేసినట్లు తేలితే ప్రభుత్వం నుంచి అందే పథకాలను రద్దు చేయనున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తే, లేదా విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం లింబుగూడ గ్రామ యువకులకు సిర్పూర్(టీ) పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లను అందజేశారు. ఆయన వెంట కౌటల సీఐ బుద్ధే స్వామి, సిర్పూర్(టీ) ఎస్ఐ రవి కుమార్, చింతలమానేపల్లి ఎస్ఐ సందీప్కుమార్, ఏఎస్ఐ సందీప్, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
దండేపల్లి, అక్టోబర్ 24: ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ చేసేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రెండ్లీ పోలీసింగ్-కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐలు, డాక్టర్లను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. యువకులకు వాలీబాల్ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ కరీముల్లాఖాన్, స్థానిక ఎస్ఐ శ్రీకాంత్, ఐఎంఏ అధ్యక్షుడు రమణ, పాల్గొన్నారు.