శ్రీరాంపూర్, నవంబర్ 11: శ్రీరాంపూర్ ఎస్సార్పీ 3గనిలో జరిగిన ప్రమాదంపై గురువారం మైనింగ్ ఇన్స్పెక్టర్లు (డీజీఎంఎస్), సింగరేణి డైరెక్టర్ బలరాం, గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు విచారణ చేపట్టారు. గనిలోకి దిగి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎస్సార్పీ 3 గనిలోని పైకప్పు కూలింది. గనిలోని 21 డీప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్మెన్, సపోర్ట్మెన్, బదిలీ వర్కర్లపై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకప్పు కూలింది. దీంతో టింబర్మెన్ బేర లచ్చయ్య (60), సపోర్ట్మెన్ వీ కృష్ణారెడ్డి (59), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహరాజు (30), రెంక చంద్రశేఖర్ (30) బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందిన విషయం విదితమే. కార్మికుల మృతదేహాలను రాత్రి 10 గంటల వరకు పూర్తిస్థాయిలో వెలికితీసి రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానకు తరలించా రు. సంస్థ పరమైన ఏర్పాట్లు చేసి మంచిర్యాల ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దివాకర్రావు ప్రత్యేక చొరవతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. ఇల్లందుకు గడ్డం సత్యనర్సింహరాజు, జన్నారం 9 గుడిసెలపల్లెకు రెంక చంద్రశేఖర్, శ్రీరాంపూర్ ఆర్కే 8కాలనీకి కృష్ణారెడ్డి, నస్పూర్ కాలనీకి బేర లచ్చయ్య మృతదేహాలను తరలించారు.
విచారణ చేపట్టిన డీజీఎంఎస్..
ఎస్సార్పీ 3గని ప్రమాదంపై డీజీఎంఎస్ అధికారులు విచారణ చేపట్టారు. గనిలోకి డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ (డీఎంఎస్) సుప్రియా చక్రబార్టి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ సంజయ్కుమార్ గని అధికారులతో దిగి ప్రమాద స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ప్రమాదంపై గనిలోపల, అనంతరం గని కార్యాలయంలో మైనింగ్ అధికారులు, అండర్మేనేజర్ అమర్నాథ్, ఓవర్మెన్ హరికృష్ణ, సర్దార్ విలాస్ను ప్రమాదం జరిగిన తీరుపై విచారించారు. సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) బలరాం, జీఎం సురేశ్, ఏజెంట్ విజయభాస్కర్రెడ్డి, ఎస్వోటూ డైరెక్టర్ రవిశంకర్, గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి గనిలో ప్రమాద స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదం జరగడం విచారకరమన్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కార్మికుల మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కుటుంబాలకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహా రం ఇప్పించడానికి తమ యూనియన్ కృషి చేస్తున్నదన్నారు.
నివాళులర్పించిన నాయకులు..
ఎస్సార్పీ 3గని ప్రమాద మృతుల కుటుంబాలను గురువారం కార్మిక సంఘాల నాయకులు కలిసి పరామర్శించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, కేంద్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, నస్పూర్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ నస్పూర్ కాలనీలో రెంక చంద్రశేఖర్, శ్రీరాంపూర్ ఆర్కే 8కాలనీలో వీ కృష్ణారెడ్డి నివాసాలకు వెళ్లి మృతదేహాలపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీ సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీసైదా, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు పేరం రమేశ్, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జే శంకర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గరిగె స్వామి సందర్శించి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు కార్మిక సంఘాలు అండగా ఉంటాయని చెప్పారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్ కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదిర్శ భాస్కర్, మహేందర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
కార్మికులకు నివాళి
రామకృష్ణాపూర్, నవంబర్ 11: ఎస్సార్పీ -3 గని ప్రమాదంలో మరణించిన నలుగురికి ఆర్కేపీ సీహెచ్పీ కార్మికులు గురువారం నివాళులర్పించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి మౌనం పాటించారు. గని ప్రమాదం దురదృష్టకరమన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిట్ కార్యదర్శి జక్కినబోయిన శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.