57 ఏండ్లు ఉన్న వారికి ఆసరా పింఛన్లు అందిస్తామన్న రాష్ట్ర సర్కారు నిర్ణయంతో కొత్తగా వేలాది మందికి లబ్ధి చేకూరనున్నది. సమైక్యపాలనలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.200 మాత్రమే పింఛన్ వచ్చేది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మొదటిసారి రూ. 1000 చొప్పున ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 ఇస్తున్నారు. పింఛన్ అర్హతకు లబ్ధిదారుల వయసు 65 ఏండ్లు ఉండగా, 57కు తగ్గిస్తూ ఆదేశాలిచ్చారు. సమైక్య పాలనలో చాలీచాలని డబ్బులతో అనేక ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారు.
ఇప్పటికే 3,37,649 మందికి..
ఆసరా పథకంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 3,37,649 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ వృద్ధాప్య పెన్షన్ల అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొత్తగా దరఖాస్తులు తీసుకున్నారు. ఈ అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీంతో 75,077 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఆగస్టు వరకు అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలు జిల్లాల ఎమ్మెల్యేలు దరఖాస్తు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు కొత్తగా మంచిర్యాల జిల్లా నుంచి 18,811, ఆదిలాబాద్ జిల్లా నుంచి 17,671, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 12,341, నిర్మల్లో 26,254 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 65,682 ఆసరా పింఛన్లు ఉన్నాయి. 31వ తేదీ వరకు 17,671 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 1,38,908 మందికి పింఛన్లు ఇస్తుండగా, 57 ఏండ్లు దాటిన వారు 26,254 మంది, మంచిర్యాల జిల్లాలో ప్రస్తుతం 85,481 మంది కాగా, 57 ఏండ్లు దాటిన వారు 18,811 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 47,578 మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా, 57 సంవత్సరాలు దాటిన వారు 12,341 మంది ఉన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెలా పింఛన్ డబ్బులు మంజూరు చేసింది. సర్కారు సాయంతో వారికి కుటుంబంలో గౌరవం పెరిగింది. వారి మందులు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుండడంతో సంతోషంగా ఉన్నారు.
అర్హులందరికీ అందేలా చర్యలు..
అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు తీసుకున్నాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 18,811 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత అధికారుల ద్వారా విచారణ చేసి అర్హులను గుర్తిస్తాం. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నాం. అర్హులందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటాం.