పెంబి, మే 19: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి వివరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కార్యకర్తలకు సూచించారు. పెంబి మండల కేంద్రంలోని విజన్ పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. పెంబి మండలంగా ఏర్పడిన తరువాత ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. గతంలో ఉన్న ఆరు పంచాయతీలు, ఇప్పుడు 24 పంచాయతీలుగా రూపాంతరం చెందాయని చెప్పారు.
తద్వారా గిరిజనులు రాజకీయంగా ఎదగడంతో పాటు, పాలన చేరువైందన్నారు. మన ఇక మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గడ్డపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆటలు సాగవన్నారు. మరోసారి కేసీఆర్నే సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల లక్ష్మీశంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, సర్పంచ్లు పూర్ణచందర్ గౌడ్, సుధాకర్, సుదర్శన్, మహేందర్, తానాజీ, రాజు, ఎంపీటీసీ రామరావు, నాయకులు శ్రీనివాస్, రమేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.