మంచిర్యాల అర్బన్, మార్చి 30 : కేంద్రీ య విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో ప్రవేశాలు, రెండు నుంచి పదో తరగతి దాకా ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యా హ క్కు చట్టం కింద ఆర్మీ ఉద్యోగులకే కాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాటి అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలు ఇందు లో చేరేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఒకటో తరగతిలో చేరేందుకు, రెండు నుంచి పదో తరగతుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కేంద్రీయ విద్యాలయం సంఘటన్(కేవీఎస్) నుంచి 64 మంది (సెక్షన్కు 32 మంది చొప్పున రెండు సెక్షన్లలో) విద్యార్థులను ఎంపిక చేసి ఆ లిస్టును విద్యాలయానికి పంపుతారు. దానిని సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. లిస్టులో ఉన్నవారే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో విద్యాలయంలో సంప్రదించి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్లలో మాత్రమే కేంద్రీయ విద్యాలయాలున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకుkvsonlinea dmission. kvg.gov.in లేదా kvssan gathan. nic.in ద్వారా లాగిన్ కావాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ (బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బ్యాంకు, పోస్టల్ తదితర) ఉద్యోగుల పిల్లలకు రెండో ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మూడో ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల (ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, తదితర) ఉద్యోగుల పిల్లలకు నాలుగో ప్రాధాన్యత, మిగిలిన వారికి ఐదో ప్రాధాన్యతగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఇందులో ఎస్సీ కుటుంబాల పిల్లలకు 15 శాతం (5 సీట్లు), ఎస్టీలకు 7.5 శాతం (2 సీట్లు), ఓబీసీలకు 27 శాతం (8 సీట్లు), విభిన్న రంగాలలో ప్రావీణ్యం ఉన్నవారికి (దివ్యాంగులకు) మూడు శాతం సీట్లు కేటాయిస్తారు. జాతీయ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల మేరకు ప్రతి తరగతిలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల పిల్లలకు 25 శాతం(8 సీట్లు) ఉచిత బోధన పద్ధతిలో భర్తీ చేస్తారు. లాటరీద్వారా వీరి ఎంపిక ఉంటుంది. ఒకటో తరగతిలో ఆర్ఈటీ కింద ప్రవేశం పొందితే పాఠశాల చదువు పూర్తయ్యే దాకా ఉచిత విద్య ఉంటుంది.
మొదటి నోటిఫికేషన్ (ఒకటో తరగతి విద్యార్థులకు) : ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై ఏప్రిల్ 15న సాయం త్రం 5గంటల వరకు కొనసాగుతోంది. ఒకటో తరగతి ప్రవేశాలకు మొదటి మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 19న, సీట్లు ఖాళీ ఉంటే రెండో మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 29న ఉంటుంది. రెండో లిస్టులో సీట్లు ఖాళీ ఉంటే మూడో మెరిట్ లిస్ట్ మే 8న ఉంటుంది.
రెండో నోటిఫికేషన్ ( రెండు నుంచి ఇంటర్ విద్యార్థులకు ) : రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అదే నెల 15వ తేదీన ఖాళీల లిస్టు ఏర్పాటు చేస్తారు. ఏప్రిల్ 16నుంచి 29వ తేదీ వరకు విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటారు. ప్రతీ తరగతిలో ఖాళీలను ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మెరిట్ జాబితా ఆధారంగా ప్రవేశం ఉంటుంది.