ఆదిలాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) ః భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. బాపు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కటింగ్, దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాపు.. వెయ్యేళ్లు వర్ధిళ్లు అని దీవించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం కేఆర్కే కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని దేగాంలో మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థించారు. ముక్రా(కే)లో రైతులు దళితబస్తీ పథకంలో భాగంగా తమకు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన భూముల్ల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తెలంగాణ బాపుగా కేసీఆర్.. : మాజీ మంత్రి రామన్న
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేసిన మహనీయుడు కేసీఆర్ అని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బాపుగా కేసీఆర్ ప్రతిష్టను సంపాదించారని తెలిపారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కృషి చేశారని తెలిపారు. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఫలితంగా రైతులు, మహిళలు, కార్మికులు, అన్ని వర్గా ల ప్రజల ఉపాధి మెరుగు పడిందన్నారు. బీఆర్ఎస్ నాయకు లు యూనిస్ అక్బానీ, రోకండ్ల రమేశ్, విజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, సాజీదొద్దీన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, దాసరి రమేశ్, స్వామి, మహిళా నాయకురాళ్లు స్వరూపారాణి, మమత, ప్రేమల, సుల్తానా పాల్గొన్నారు.