బోథ్ : ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులకు గౌరవ వేతనం పెంచినందుకు స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధుల సంక్షేమానికి పాటు పడుతున్నారని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడానికి ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు చేస్తున్న కృషిని గుర్తిస్తూ సీఎం కేసీఆర్ గౌరవ వేతనాన్ని పెంచారన్నారు. వేతనం పెంపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాథోడ్ లింబాజీ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.