నిర్మల్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : ‘మన దేశంలో 1947 స్వాతంత్య్రం రాక ముందు ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 3-4 కేజీల వంట నూనె వినియోగించే వారు. అది ఇప్పుడు 20 కేజీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఏటా 22 నుంచి 23 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనెను వినియోగిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
గత ఐదారేళ్లుగా ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే 140 కోట్ల మందికి సరిపడా నూనెల కోసం 50 నుంచి 80 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుంచి పామాయిల్ను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్నాక్స్ ఫుడ్ కల్చర్కి పామాయిలే ప్రత్యామ్నాయంగా మారడంతో ఆయిల్ పామ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.’ అని రాష్ట్ర ఉద్యానవన శాఖ మాజీ కమిషనర్ లోక వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు గురించి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పామాయిల్ తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. రాష్ట్రంలో 27 నుంచి 30 లక్షల వరకు బోరుబావులు ఉండడంతో వాటి కింద 50 నుంచి 60 లక్షల ఎకరాలకు ఏడాది పొడవునా సాగు నీరందించే అవకాశం ఉండడం ఆయిల్పామ్ సాగుకు వరంలా మారిందని పేర్కొన్నారు. అలాగే 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం, పామాయిల్ సాగుకు ఇక్కడి భూములు అనుకూలమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా రైతులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు.
నాలుగైదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 సంవత్సరంలో దాదాపు 84 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 కంపెనీలు, 36 నర్సరీలను ఏర్పాటు చేసి, లక్షల మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాయన్నారు.
ఏటా 30-40 లక్షల మొక్కలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఆయా కంపెనీలు.. అవసరమైన సీడ్ మెటీరియల్ను ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, కోస్టారికా దేశాల నుంచి తీసుకొచ్చి 12 నెలలపాటు ఇక్కడి నర్సరీల్లో పెంచి రైతులకు పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. మొక్క నాటిన నాటి నుంచి దిగుబడి ప్రారంభమయ్యే వరకు 4 ఏళ్లపాటు ఎకరానికి రూ.50 వేల వరకు సబ్సిడీ ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఎంతో ప్రోత్సహించించడం వల్లనే రైతులు ముందుకు వచ్చారన్నారు.
ఒక టన్నుకు రూ.15 వేల మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం కల్పించే అవకాశాలు ఉన్నాయని, పర్యావరణానికి ఈ ఆయిల్ పామ్ పంట మంచిదన్నారు. ఒక ఎకరంలో నాటిన ఆయిల్ పామ్ చెట్లు ఏడాదికి 17-18 మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ను తీసుకొని 12-13 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను విడుదల చేసే ఏకైక పంట ఇదే అన్నారు. ఆక్సిజన్ పరంగా ఐదెకరాల దట్టమైన అడవి కంటే ఒక ఎకరం ఆయిల్ పామ్ పంట సమానమన్నారు. ప్రతి పక్షం రోజులకోసారి ఈ ఆయిల్పామ్ గెలలు రావడం వల్ల రైతుకు నిరంతర ఆదాయం చేకూరుతుందని తెలిపారు.
ఎకరం వరి పంటకు అవసరమైన నీటితో దాదాపు ఐదెకరాల ఆయిల్ పామ్ తోటను సాగు చేయవచ్చని, దీంతో సాగునీటిని, కరెంటును ఆదా చేయవచ్చన్నారు. అలాగే సాధారణ పంటలకు జరిగే నష్టం ఈ ఆయిల్పామ్కు ఉండదన్నారు. కోతులు, అడవిపందుల బెడద, రాళ్ల వాన, దొంగల బెడద ఉండదు కాబట్టి ఇది రైతులకు ఎంతో అనువైన పంట అన్నారు. మొక్కలు నాటిన నాటిన నుంచి మూడేళ్ల వరకు పసుపు, పత్తి, వేరుశనగ, నువ్వు, సోయా, శనగ, మక్క, కూరగాయల వంటి అంతర పంటలను వేసుకోవచ్చని తెలిపారు.
అలాగే తోటల చుట్టూ గట్లపై టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం చెట్లు, జామ, సీతాఫల్, మామిడి చెట్లను పెంచుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. రైతులు నూతన పంథాలో ఆలోచన చేసి అనాదిగా వస్తున్న సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంట అయిన ఆయిల్ పామ్ను సాగు చేస్తే 30 ఏళ్లపాటు నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చన్నారు. యువతరం స్మార్ట్ వ్యవసాయం దిశగా ఆలోచిస్తున్నారని, అలాంటి వారితోపాటు, రాష్ట్ర రైతాంగం పెద్ద మొత్తంలో ఆయిల్ పామ్ సాగు చేసి మంచి ఉపాధి పొందాలని సూచించారు.
నిర్మల్ ప్రాంతంలో ప్రీ-యూనిక్ అనే మలేషియాకు చెందిన కంపెనీకి ఏడు జిల్లాలను కేటాయించారని, వీటిలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలో ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నారన్నారు.
ప్రీ-యూనిక్ కంపెనీకి ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఆయా దేశాల్లోని నర్సరీల్లో టొపాజ్ అనే మంచిరకం మొక్కలను ఉత్పతి చేసి ఈ ప్రాంత రైతులకు అందుబాటులోకి తేవడం శుభ పరిణామమన్నారు. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లి నర్సరీలో ఈ టొపాజ్ రకం ఆయిల్పామ్ మొక్కలు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ రకం మొక్కలను దాదాపు 6 వేల ఎకరాల్లో నాటడం జరిగిందని, మరో 4 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు జరిగేలా చూడాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆయిల్పామ్ సాగుకు ముందుకొచ్చే రైతులకు అనేక ప్రోత్సాహకాలు అందజేసింది. అయితే ఈ పంటపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ముందుకు రాలేదన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కృషితో 25 శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడి రైతులు ఆయిల్పామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఏ విధంగానైతే ప్రోత్సహించిందో అదే విధంగా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లాలని కోరారు. అంతేకాకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి వచ్చే నాలుగేళ్లపాటు ఆయిల్పామ్ సాగును పర్యవేక్షించేలా చేస్తే ఈ ప్రాంత రైతులకు మేలు జరిగి తెలంగాణ ఒక సుసంపన్న రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. పర్యావరణ పరంగా ఈ పంట ఎంతో మంచిది కావడంతో ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు.