నిర్మల్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : సర్జరి తర్వాత పూర్తిగా కోలుకుని మళ్లీ జనం మధ్యకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ సారథి కేసీఆర్కు జనం జేజేలు పలికారు. మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరు కావడంతో ఆయన ప్రసంగాన్ని వినేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. బహిరంగ సభా కార్యక్రమాన్ని టీవీల్లో లైవ్ ద్వారా తిలకించారు. కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రజలు శ్రద్ధగా విని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉద్యమ కాలం నాటి తరహాలో కృష్ణా జలాల సమస్యపై సుదీర్ఘంగా ప్రసంగించి కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలన్న కుట్రతో చేస్తున్న రాద్దాంతాన్ని విపులంగా తెలిపారు. ప్రతి అంశంపై క్షుణ్ణంగా, గణాంకాలతో కాంగ్రెస్ కుట్రలను ఎండగడుతూ చేసిన ప్రసంగం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పాలించాలన్న అంశాన్ని కూడా వివరించారు. పెద్దన్న తరహాలో సీఎం కేసీఆర్ ప్రసంగించడంపై టీవీల్లో ఈ సభను తిలకించిన వారంతా ఆయన గొప్పతనాన్ని అభినందిండమే కాకుండా, అడుగడుగునా నీరాజనం పలికారు. నల్గొండ సభ మరోసారి కేసీఆర్కు ఉన్న ప్రజా బలాన్ని, అలాగే ఆయన ప్రసంగంలోని వాడీవేడీని ప్రతి ఒక్కరు గుర్తించారు.
కేఆర్ఎంబీపై కేంద్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గతంగా చేసుకున్న ఒప్పందం బహిర్గతమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇరిగేషన్ మాజీ మంత్రి హరీశ్రావ్లు వెంటనే స్పందించి కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందుంచాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు భయపడే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి హడావుడిగా కేఆర్ఎంబీకి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నల్గొండలో కేసీఆర్ సభ పెట్టిన వెంటనే, ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ సందర్శన అంటూ షో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నల్గొండ సభకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు కేసీఆర్కు స్వాగతం పలికారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకునేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. బహిరంగ సభలో కేసీఆర్ను చూడగానే ప్రజలు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు అడ్డగోలు విమర్శలు, దూషణలకు పాల్పడడాన్ని ఎవరు కూడా తట్టుకోలేక పోతున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మాజీ మంత్రి.
బోథ్, ఫిబ్రవరి 13 : నల్గొండ జిల్లాలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ప్రజలు రైతులు సమావేశానికి తరలివెళ్లారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమ బాట చేపట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్కు జనం జై కొట్టారు. కృష్ణ నీటి వాటాలో మనకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పనంగా ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పిందని రైతులకు అర్థమయ్యే రీతిలో విపులంగా వివరించారు. ప్రాజెక్టు అప్పగిస్తే వాటిపై మనం పూర్తిగా హక్కు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణకు ఏ నష్టం జరిగినా ప్రాణత్యాగానికి సిద్ధమని కేసీఆర్ నిండుసభలో ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున జేజేలు పలికారు. నల్గొండ సభతో కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందన్నారు.
– జాదవ్ అనిల్ కుమార్, ఎమ్మెల్యే, బోథ్.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 13 : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా కృష్ణా జలాల పంపిణీ విషయపై అబద్ధాలు చెబుతూ ప్రజలను పకదోవ పట్టిస్తున్నది. కృష్ణా జలాల పంపిణీ చట్ట ప్రకారమే జరిగింది. కేసీఆర్ సర్కారులో నీళ్లకోసం ఆంధ్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు గొడవ జరిగిన విషయం ప్రజలందరికీ తెలుసు. కృష్ణ బేసిన్పై పోలీస్ పహారా మధ్య నీటి విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం చేతగాక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నది. అందుకే బీఆర్ఎస్ అధినేత నీళ్లకోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్.