మంచిర్యాల, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా తిప్పేసింది. కేసీఆర్ ఎక్కడికెళ్లినా జనం నీరాజనం పడుతుండగా, ప్రత్యర్థి పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. కేసీఆర్ రాజకీయ చతురత ముందు కాంగ్రెస్, బీజేపీలు నిలబడలేకపోతున్నాయి.
తెలంగాణ తొలి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు, కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న కుట్రలు, తెలంగాణ అంటే గిట్టనోళ్లు చేస్తున్న రాజకీయాలను వివరించడంలో కేసీఆర్ సఫలమయ్యారు. ఇటీవల ఓ టీవీ చానల్కు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా, ఏ షోకు రానన్ని వ్యూస్ ఆ షోకు రావడం గమనార్హం. తెలంగాణ ప్రజల్లో నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు ఆ షోలో కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఆయన ఎండగడుతున్న తీరు ప్రజల ఆలోచనలను పూర్తిగా మార్చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు రక్షణ అనే చర్చ మొదలైంది.
అది ఈ ఎన్నికల్లో పార్టీకి ఎంతగానో కలిసిరానుండడంతో పాటు, ఇప్పటికే పలు సర్వేలు బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని తేల్చి చెబుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది. బస్సు యాత్ర సందర్భంగా వచ్చిన జనాలను ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలకు అనూహ్య స్పందన వస్తున్నది. యాత్రలో ఆయన అడిగే ప్రశ్నలకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను విమర్శిస్తున్నప్పుడు జనం నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. కేసీఆర్ను చూసేందుకు.. ఆయన ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
కేసీఆర్ జనంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన కరువు, పరిపాలన వైఫల్యాలు, వ్యవసాయంలో సంక్షోభం, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్, ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం ఇలా ప్రతి విషయాన్ని జనానికి అర్థమయ్యే రీతిలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగాలు ఉంటున్నాయి. దీంతో చాలా మంది ఆయన ఎప్పుడెప్పుడు జిల్లాకు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో మే 3న రామగుండం, 4న మంచిర్యాలలో రోడ్షోలు నిర్వహించనుండగా, అన్నదాతలు, సింగరేణి కార్మికులు, ప్రజలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు.
అవకాశం దొరికితే తమ కష్టాన్ని కేసీఆర్కు చెప్పుకోవాలని ఆతృతలో ఉన్నారు. బస్సు యాత్రకు భారీగా తరలివెళ్లి మద్దతు తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. కేసీఆర్ యాత్రతో పెద్దపల్లి పార్లమెంట్లో బీఆర్ఎస్ విజయావకాశాలు పెరుగుతాయని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఒక్కసారి పెద్ద సార్ వచ్చిపోతే రాజకీయవాతావరణం పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టూర్తో పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారాన్ని ముమ్మరం చేయగా, త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనుండడంతో ఎక్కడికక్కడ కార్యకర్తలు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నారు.
చేపకింద నీరులా విస్తరిస్తున్న కేసీఆర్ మ్యానియా.. గడిచిన వారంలోనే విపరీతమైన గ్రాఫ్ను పెంచిందంటున్నారు. సైలెంట్ ఓట్ బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్లుతుందని జోష్యం చెబుతున్నారు. మరోవైపు మాదిగ, మాల సామాజిక వర్గాలు సైతం కేసీఆర్ యాత్ర కోసం ఎదురుచూస్తున్నాయి. పార్లమెంట్ సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తమకు అన్యాయం చేసిందని, బీజేపీని గెలిపిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంలో ఉన్న ఈ వర్గాల ప్రజలు, నాయకులు కేసీఆర్కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు మాజీ సీఎం కేసీఆర్ రాకకోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. సభలకు భారీగా జనాలు తరలివచ్చి కేసీఆర్ ప్రభావం పడితే కచ్చితంగా ఈ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.