దండేపల్లి, నవంబర్ 20 : కార్తీక బహుల ఏకాదశిని పురస్కరించుకొని దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా 837 జంటలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించాయి. భక్తుల రద్దీని దృష్టిలోపెట్టుకొని అధికారులు అదనంగా రెండు మండపాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది ఉన్నారు.
చెన్నూర్ గోదావరి తీరంలో..
చెన్నూర్ టౌన్, నవంబర్ 20 : చెన్నూర్ గోదావరి తీరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అర్చకుడు శ్రీరాంభట్ల శశాంక్ నేతృత్వంలో పంచక్రోశ ఉత్తర వాహినీ గోదావరి తీరాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో 93 జంటలు పాల్గొన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.