రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి వైద్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మొదటి విడతలో 7,25,832 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు అందజేశారు. మరికొందరికి ఉచిత ఆపరేషన్లు నిర్వహించారు. తొలి విడుతలో వచ్చిన ఫలితాల ఆధారంగా రెండో విడుత ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను నియమించి, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. మూడు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుండగా, ఎంతో మంది పేదలు, అభాగ్యులకు మేలు చేకూరనున్నది.
ఆదిలాబాద్/నిర్మల్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): దేశంలో ఏరాష్ట్రం నిర్వహించని రీతిలో చేపట్టిన కంటి వెలుగు-1 స్ఫూర్తితో ప్రభుత్వం రెండో విడుత కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. కనీసం దవాఖానకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న ఎందరో పేదలు, అభాగ్యులకు చూపునిచ్చి, వెలుగులు నింపిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రజల ముంగిటకు తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2018 పంద్రాగస్టున తొలివిడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమం ప్రారంభం కాగా, 2019 మార్చి 31 వరకు కొనసాగింది. మొ దటి విడుతలో వచ్చిన సత్ఫలితాలను అంచ నా వేసుకొని రెండో విడుతలో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యం త్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. గత 15 రోజుల క్రితమే రెండో విడుత కంటివెలుగుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ పంపాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ సారి కంటివెలుగు-2ను 90 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచా రం. నిర్మల్ జిల్లాకు సంబంధించి 16 పీహెచ్సీలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో జనా భా ప్రాతిపదికన 33 బృందాలతో శిబిరాలు నిర్వహిస్తేనే నిర్దేశించిన గడువులోగా కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చని స్థానిక అధికారులు నివేదికలు పంపినట్లు తెలిసింది.
తొలి విడుతలో 7,25,832 మందికి పరీక్షలు
కాగా తొలివిడుత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 3,49,973 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 32,978 మందికి కళ్లజోళ్లను పంపిణీ చేశారు. 36,472 మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని గుర్తించారు. జిల్లాలో 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 521 చోట్ల కంటి పరీక్షల శిబిరాలు నిర్వహిస్తారు. 90 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 28 వైద్య బృందాలను నియమించనున్నారు. మూడు అత్యవసర బృందాలు ఉంటాయి. 28 మిషన్లు, 31 మంది కంటి వైద్య నిపుణులు, 62 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవసరమవుతారు. ఆదిలాబాద్ జిల్లా జనాభా 7,08,967 ఉండగా 5,31,725 మందికి పరీక్షలు చేయనున్నారు. ఈ విడుతలో 75 శాతం మందికి కంటి పరీక్షలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో మొదటి విడుతలో మొత్తం 18 బృందాలతో శిబిరాలు నిర్వహించగా, 3,75,859 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో కంటి చూపుతో బాధపడుతున్న వారిని గుర్తించి కంటి అద్దాలను అందజేయడంతో పాటు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను కూడా చేయించారు. దగ్గర చూపు సమస్యతో 62,342మంది, దూరపు చూపు సమస్యతో 53919మంది బాధపడుతున్నట్లు గుర్తించి, వారందరికీ కంటి అద్దాలను పంపిణీ చేశారు. అలాగే 29,234మందికి క్యాటరాక్ట్ (మోతెబిందు) సర్జరీలు అవసరమున్నట్లు గుర్తించారు. నిర్మల్ జిల్లాలో శస్త్ర చికిత్సలు చేసేందుకు సదుపాయం లేకపోవడంతో వీరందరినీ దశలవారీగా ఆదిలాబాద్ రిమ్స్, హైదరాబాద్లోని పుష్పగిరి కంటి దవాఖాన, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి సర్జరీలు చేయించారు. తొలి విడుత కంటివెలుగు కార్యక్రమం విజయవంతం కావడంతో, రెండవ విడుత కూడా అదే ఉత్సాహంతో సక్సెస్ చేసేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సిద్దమవుతున్నారు.
ప్రణాళికలు తయారు చేశాం..
జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రణాళికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చేపడుతాం. సిబ్బందికి శిక్షణ ఇస్తాం. గతంలో నిర్వహించిన కంటి వెలుగు ద్వారా ఎంతోమంది నిరుపేదలకు ప్రయోజనం కలిగింది. ఈ సారి మరింత ఎ క్కువ మంది కంటి పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో అ వగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. – నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్
సద్వినియోగం చేసుకోవాలి..
వచ్చే జనవరి 18 నుంచి రెండో విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కంటి స మస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్రమానిన పకడ్భందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా కం టి పరీక్షలకు అవసరమైన పరికరాలను సి ద్ధం చేస్తున్నాం. అలాగే అవసరమైన మేర కు సిబ్బందిని ఎంపిక చేసి శిబిరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. ఉన్నతాధికారుల నుంచి ఇంకా పూర్తి స్థాయి గైడ్లైన్స్ రావాల్సి ఉన్నది.
– డాక్టర్ ధన్రాజ్, జిల్లా వైద్యాధికారి, నిర్మల్