మంచిర్యాలటౌన్, మార్చి 1: కాకతీయ విశ్వ విద్యాలయ వృక్షశాస్త్ర విభాగ పరిశోధకురాలు యాట్ల స్రవంతి డాక్టరేట్ అందుకున్నది. ఇటీవల కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నర్సింహాచారి ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టర్ యాట్ల స్రవంతి ‘ఇన్విట్రో క్లోనల్ ప్రొపగేషన్ అండ్ జెనెటిక్ ఫెడిలిటీ ఇన్ సెమికార్పస్ అనకార్డియమ్ ఎల్ . ఎఫ్’ అనే అంశంపై విభాగ ఆచార్యులు ఎండీ ముస్తఫా పర్యవేక్షణలో తన రీసెర్చ్ను పూర్తిచేశారు. ఇటీవల నిర్వహించిన సెమినార్లో ఆమె రీసెర్చ్ వివరాలను వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పిట్టల వాడకు చెందిన యాట్ల స్రవంతి అక్కడే ఏకశిల పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసింది. కాకతీయ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, సాయిరాం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ బీజెడ్సీ, కరీంనగర్లోని ఎస్ఆర్ఎం కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా స్రవంతిని బోధన, బోధనేతర సిబ్బంది, కుటుంబ సభ్యులు అభినందించారు.