పర్యాటక ప్రాంతమైన కడెంకు సందర్శ కుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జలాశయం, అటవీ ప్రాంత అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రాజెక్టులో బోట్లతో పాటు ప్రకృతి ఒడిలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ మంత్రముగ్ధులవు తుంటారు. ఈక్రమంలో టూరిస్టుల కోసం అటవీ శాఖ అధికారులు కొత్తగా ‘నేచర్ సఫారీ’కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు త్వరలోనే రానుండగా, ప్రకృతి ప్రేమికులకు మరింత ఆహ్లాదం కలుగనున్నది.
Nature safari | కడెం, ఏప్రిల్ 28: కడెం అడవుల్లో పర్యాటకాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే కడెం జలాశయంతో పాటు అటవీ అందాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆకట్టుకున్నాయి. అడవుల అందాలను వీక్షించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వాచ్టవర్లను కూడా ఏర్పాటు చేశారు. కాగా, కడెం మండలంలోని గంగాపూర్, అల్లంపల్లి, లక్ష్మీపూర్, పాండ్వాపూర్ ప్రాంతాల్లో చూడచక్కని రమణీయ ప్రాంతాలున్నాయి. అయితే దోస్త్నగర్ ప్రాంతంలో అటవీశాఖ అధ్వర్యంలో ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వు లోగోను ఆవిష్కరించగా, ఇది నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారి పక్కన ఉంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ మూడు జిల్లాలను కలిపే ఈ ప్రాంతానికి దగ్గరలో దీనిని ఏర్పాటు చేయగా, రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు లోగో దగ్గర ఆగుతూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ లోగో ప్రాంతం నుంచి కడెం అడవుల్లో పర్యటించేలా నేచర్ సఫారీని ఏర్పాటు చేశారు. ఇటీవల దీనిని అటవీ శాఖ పీసీసీఎఫ్ ప్రారంభించారు.
కవ్వాల్ టైగర్ రిజర్వు లోగో నుంచి దోస్త్నగర్ అడవుల్లో కడెం, ఉడుంపూర్ రేంజ్ల పరిధిలో 17.5 కిలోమీటర్ల పరిధిలో పర్యటన ఉంటుంది. దోస్త్నగర్ నుంచి ఈ రహదారి వెంట వెళ్లగా పచ్చటి ప్రకృతి అందాలతో పాటు, వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన గ్రాస్ప్లాంట్, మైసంపేట గ్రామం, అక్కడి అందాలు, అటవీ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వాచ్టవర్ను ఎక్కి ప్రకృతి అందాలను చూసేలా ట్రాక్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వాహనాలు కూడా మే మాసంలోగా రానున్నట్లు అధికారులు తెలిపారు. కడెం మండలంలో కడెంతో పాటు, ఉడుంపూర్ రేంజ్ల పరిధి ఉండగా, ఉడుంపూర్ రేంజ్ పరిధిలో 13.5 కిలోమీటర్లు, కడెం రేంజ్ పరిధిలో 4 కిలోమీటర్ల మేరకు ట్రాక్ను సిద్ధం చేశారు. దీనికి గాను పర్యాటకుల వద్ద పిల్లలకు రూ 200, పెద్దలకు రూ 400 చొప్పున చార్జీలను నిర్ణయించారు. అయితే ఈ ప్రాంతం కడెం మండల కేంద్రానికి అందుబాటులో ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా టూరిజం గదులు ఉన్నాయి.
ఒక రోజుకు రూ. 1800 చొప్పున చెల్లిస్తే రూంతో పాటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్టును కూడా అందజేస్తారు. ఇక్కడి రిసార్ట్ అందాలతో పాటు పక్కనే జలాశయంలో బోట్ విహారం మరింత ఆహ్లాదాన్ని అందించనుంది. ఈ తరుణంలో కడెంకు మరింత పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఇప్పటికే జన్నారం మండలంలో దీనిని అటవీ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సత్ఫలితాలు రావడంతో కడెం, ఉడుంపూర్ రేంజ్ల పరిధిలో కూడా దీనిని అమలు చేయాలని, దాని నుంచి వచ్చే రాబడిని అటవీశాఖకు ఉపయోగపడేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా వాహనాల సంఖ్యను పెంచేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. కడెం జలాశయంలో బోటింగ్తో పాటు ఇప్పుడు ఏర్పాటు చేయనున్న నేచర్ సఫారీ ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి మరింత పెంచనుంది.